ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రభుత్వ పనితీరుపై సమగ్ర ప్రొగ్రెస్ రిపోర్ట్ ను మీడియా ముందు ఉంచారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, మహిళా సాధికారత, ఉపాధి, పరిశ్రమలు, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక, పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొందని పేర్కొంటూనే, ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, పరిపాలన పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబు విమర్శించారు. అధికారులు, ప్రజలు, పోలీసుల వరకు భయపడే పరిస్థితి నెలకొందని, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పరిశ్రమలు కూడా ఏపీ వైపు చూడని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో ప్రజలు నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికి ఎన్డీఏ కూటమికి 57 శాతం ఓట్లు, 94 శాతం స్ట్రైక్ రేటుతో ఘన విజయం అందించారని గుర్తు చేశారు. రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటుపై గణాంకాలను వివరించిన సీఎం, 2014-19 మధ్య ఏపీ వృద్ధిరేటు 13.5 శాతం ఉండగా, 2019-24లో అది 10.3 శాతానికి పడిపోయిందన్నారు. ప్రస్తుతం 2024-26 కాలంలో తిరిగి 11.3 శాతం వృద్ధిని సాధించామని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ వృద్ధిరేటు 10.7 శాతంగా ఉందని పేర్కొన్నారు. గతంలో ఉన్న వృద్ధి కొనసాగి ఉంటే రాష్ట్రానికి అదనంగా రూ.6.94 లక్షల కోట్ల జీఎస్డీపీ, రూ.76 వేల కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చేదని వివరించారు. విభజన తర్వాత రాజధాని కోల్పోవడం, ఆదాయ వనరులు తగ్గిపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణతో పోలిస్తే తలసరి ఆదాయంలో భారీ అంతరం ఏర్పడిందని, ప్రస్తుతం దానిని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025-26 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.2,94,507కు చేరిందని, గత వృద్ధిరేటు కొనసాగి ఉంటే అది రూ.3.67 లక్షలకు చేరుకునేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావాలంటే ముందుగా పెట్టుబడులు రావాలని సీఎం స్పష్టం చేశారు. అందుకే పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు తీసుకొచ్చామని చెప్పారు. గత రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోగా, ఇప్పటికే రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పనులు ప్రారంభించాయని వెల్లడించారు. ఏపీని మళ్లీ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మౌలిక వసతుల నిర్మాణానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రెండేళ్లలో అమరావతికి రూ.10 వేల కోట్లు, పోలవరానికి రూ.8,300 కోట్లు, పోర్టుల అభివృద్ధికి రూ.5,437 కోట్లు, ఎయిర్పోర్టులకు రూ.2,302 కోట్లు, జల్ జీవన్ మిషన్కు రూ.1,142 కోట్లు, రహదారి నెట్వర్క్కు రూ.3,439 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అదనంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల కోసం రూ.38,800 కోట్లు, రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.64,417 కోట్లు వెచ్చించిందని వివరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంపై వస్తున్న విమర్శలను సీఎం ఖండించారు. పీపీపీ ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ప్రైవేట్ సంస్థలు చేపట్టినా, ఆస్తుల యాజమాన్యం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతో కొందరు పీపీపీని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు విజయవంతమైతే మాత్రం వాటికి తామే క్రెడిట్ తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, కొన్ని పథకాలలో ప్రకటించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రకటించిన తేదీల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తూ రెండు చక్రాల్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు. 2026-27 నాటికి ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంతో రూ.2,246 కోట్ల క్రెడిట్ సపోర్ట్ అందిస్తున్నామని చెప్పారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రూ.43,219 కోట్ల రుణాలు అందుబాటులోకి వచ్చాయని, వారి ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. ఐఐటీ, నీట్, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు గ్రామీణ, పేద కుటుంబాల విద్యార్థులను సిద్ధం చేసే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం జీతాలు, పెన్షన్లకే వెళ్తోందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఆదాయాలు తగ్గిపోవడంతో మానవ వనరుల వ్యయం 110 శాతానికి చేరిందని, ప్రస్తుతం ఆదాయాలను పెంచడం ద్వారా దానిని 95 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెల సమయానికి జీతాలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించామని వెల్లడించారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని "విషవలయం"లోకి నెట్టిందని, తమ ప్రభుత్వం "డెవలప్మెంట్ సైకిల్"లోకి తీసుకొస్తోందని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు, మౌలిక వసతులు, సంక్షేమం, మహిళా సాధికారత, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కుటుంబాన్ని ఆదాయానికి అనుగుణంగా నడిపినట్లే ప్రభుత్వాన్ని కూడా ఆర్థిక బాధ్యతతో నడపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, భవిష్యత్ తరాలకు బలమైన ఆంధ్రప్రదేశ్ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
మీడియా ముందు కూటమి ప్రభుత్వ రెండేళ్ల కూటమి పాలన !
الثلاثاء، 4 أغسطس 2026
Andhra Pradesh Chief Minister Chandrababu presented Presenting the Coalition Government's Two-Year Performance to the Media
ليست هناك تعليقات:
إرسال تعليق