తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరుతో మరో కొత్త చర్చ మొదలైంది. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ను ప్రొజెక్ట్ చేస్తూ ఆయన పార్టీ టీవీకే వర్గాలు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే-సీవోటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ తరుణంలో.. అక్కడి ప్రతిపక్ష డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. రాజకీయ ఉద్దండులను తోసేసి నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని రేసులో విజయ్ ఉన్నారన్నది ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. అంతేకాదు సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగానూ ఆయనకు అర్హత ఉందంటూ రాహుల్ గాంధీ తర్వాతి ప్లేస్ను కట్టబెట్టారు. దీంతో విజయ్కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉందని.. రాబోయే రోజుల్లో పక్కా దేశానికి ప్రధాని అవుతారంటూ టీవీకే హడావిడి చేస్తోంది. అయితే ఈ ప్రచారంపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి స్పందిస్తూ ఆయన పార్టీ కార్యకర్తలు కోరుకుంటే విజయ్ పీఎం ఏంటి.. ఏకంగా ఐక్యరాజ్యసమితి అధిపతి అవుతారని సెటైర్ వేశారు. "వారి ఊహలకు హద్దుల్లేవు.. ఏదైనా ఊహించుకోనివ్వండి" అంటూ ఆర్ఎస్ భారతి కామెంట్ చేశారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆ పార్టీ ఆశయం ఏమైపోతుందో అంటూ ఇంకో చురక అంటించారు. ఇండియా టుడే సర్వే, టీవీకే చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కూడా పరోక్షంగా స్పందించినట్లు ఆయన తాజా ట్వీట్తో స్పష్టమవుతోంది. 'ది ఫాక్స్ ఫేక్ పోల్' పేరుతో ఓ నక్క కథను ఎక్స్లో పంచుకున్న ఆయన సర్వేలో ఎంతమందిని ప్రశ్నించారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు అడిగారు? ఫలితాలను ఎలా లెక్కించారు? వంటి అంశాలను ప్రస్తావించారు. "ప్రతి సంఖ్య నిజాన్ని చెప్పదు.. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు" అంటూ తేల్చేశారు. ఆయన చెప్పిన కథలో ఏముందంటే ఒక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులు. అడవికి సంబంధించి ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసే తీసుకుంటారు. వారి స్నేహాన్ని చూసి ఈర్ష్యపడిన గుంటనక్క కొందరిని మాత్రమే అడిగి ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వే పేరుతో సింహానికి ఏనుగుపై, ఏనుగుకు సింహంపై అనుమానాలు కలిగించి వాళ్లను విడగొట్టాలని చూస్తుంది. చివరకు ఓ చీమ ముందుకు వచ్చి నక్కను అందరి ముందే నిలదీస్తుంది. సర్వేలో ఎంతమందిని అడిగారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు వేశారు? ఫలితాలను ఎలా లెక్కించారు? అని ప్రశ్నించడంతో నక్క నీళ్లునములుతూ కనిపిస్తుంది. అలా ఏనుగు-సింహం స్నేహం చెడిపోకుండా కాపాడుతుంది.
ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు : ఇండియా టుడే-సీవోటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేపై డీఎంకేతో పాటు కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
الاثنين، 31 أغسطس 2026
DMK and Congress take digs at the India Today-CVoter 'Mood of the Nation' survey Not every survey reflects the public's voice Sharing a story about fox on 'X'—titled "The Fox's Fake Poll" tamilnadu
ليست هناك تعليقات:
إرسال تعليق