విమానాశ్రయాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, ముఖ్యంగా హోటళ్లలో లభించే పబ్లిక్ వైఫై నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని 'స్టార్మ్-2945' (రష్యా ఆధారిత 'మిడ్నైట్ బ్లిజార్డ్' సమూహం) అనే హ్యాకర్ల ముఠా 'క్యాప్టివ్క్రంచ్' పేరిట ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విభాగం బహిర్గతం చేసింది. మనం హోటల్ లేదా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యే సమయంలో కనిపించే 'క్యాప్టివ్ పోర్టల్' (లాగిన్ స్క్రీన్) ఆధారిత నెట్వర్క్ వ్యవస్థలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. యూజర్లు నెట్వర్క్లో లాగిన్ కాగానే నకిలీ మైక్రోసాఫ్ట్ 365 లాగిన్ పేజీలు లేదా విండోస్ అప్డేట్, డిఫెండర్ సెక్యూరిటీ స్కాన్, బ్రౌజర్ అప్డేట్ చేసుకోమంటూ నకిలీ పాప్అప్లను చూపిస్తున్నారు. యూజర్లు వీటిని నిజమైనవిగా భావించి క్లిక్ చేయగానే 'కార్న్ఫ్లేక్', 'చోకోషెల్' వంటి మాల్వేర్లు డివైజ్లోకి ప్రవేశిస్తాయి. ఈ మాల్వేర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల కంప్యూటర్లు, మొబైళ్లపై పూర్తి నియంత్రణ సాధిస్తారు. బ్రౌజర్లో సేవ్ చేసిన పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, బ్రౌజర్ కుకీలు, మైక్రోసాఫ్ట్ 365 ఖాతాల యాక్సెస్ను దొంగలిస్తారు. దీనికితోడు పరికరం మైక్రోఫోన్, కెమెరాలను రహస్యంగా ఆన్ చేసి ఆడియో, వీడియోలను రికార్డ్ చేయడం, స్క్రీన్షాట్లు తీయడం వంటి అక్రమాలకు ఒడిగడుతున్నారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు నమ్మదగని, తెలియని హోటల్ వైఫై కంటే సొంత మొబైల్ డేటా/హాట్స్పాట్ లేదా ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ కనెక్షన్లను ఉపయోగించడమే అత్యంత సురక్షితం. వైఫై కనెక్ట్ అయ్యే సమయంలో సాఫ్ట్వేర్, బ్రౌజర్ లేదా సిస్టమ్ అప్డేట్ చేయమంటూ వచ్చే పాప్అప్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. సైబర్ ముప్పులను నివారించడానికి సురక్షిత వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్), మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) ఫీచర్లను ఆన్లో ఉంచుకోవాలి. పబ్లిక్ నెట్వర్క్లు ఏ క్షణమైనా ప్రమాదకరంగా మారవచ్చని, డిజిటల్ భద్రత పట్ల ప్రయాణికులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
0 Comments