హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సరికొత్త క్లౌడ్ డేటా సెంటర్ రీజియన్ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఇది నాలుగో సెంటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సేవల డిమాండ్కు అనుగుణంగా హైదరాబాద్ లో సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ కొత్త కేంద్రం ద్వారా హైదరాబాద్ ఐటీ రంగంలో తన స్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకుంది. దేశంలో ఇప్పటికే పుణె, చెన్నై, ముంబైలో మూడు క్లౌడ్ రీజియన్లు పనిచేస్తున్నాయి. ఇవే కాకుండా, ప్రముఖ టెలికాం సంస్థ జియో భాగస్వామ్యంతో 'జియో ఇండియా వెస్ట్', 'ఇండియా సెంట్రల్' పేరుతో మరో రెండు డేటా సెంటర్లను కూడా మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తోంది. ఈ తాజా విస్తరణతో దేశం లో అత్యంత భారీ హైపర్స్కేల్ క్లౌడ్ నెట్వర్క్ కలిగిన సంస్థగా మైక్రోసాఫ్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా సౌత్ సెంట్రల్ పేరుతో ప్రారంభించిన ఈ రీజియన్ గురువారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ రీజియన్తో దేశంలో అందుతున్న అత్యధిక హైపర్స్కేల్ క్లౌడ్ సేవలు తమవేనని వెల్లడించింది. హైదరాబాద్ రీజియన్లో మూడు అవైలబిలిటీ జోన్లు ఉన్నాయని, ఇక్కడ నీటి వినియోగంలేని కూలింగ్ సాంకేతికతను వినియోగి స్తున్నామని వివరించారు. ఈ నూతన రీజియన్ ద్వారా వినియోగదారులు తమ డేటాను స్థానికంగానే భద్రపరుచుకోవచ్చు. దీనివల్ల అత్యున్నత భద్రతతో పాటు వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, 2030 నాటికి నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఇందులో "జీరో-వాటర్ కూలింగ్" సాంకేతికతను ఇక్కడ వినియోగిస్తున్నారు. అదానీ గ్రూప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీబీ పే వంటి ప్రముఖ భారతీయ సంస్థలు ఇప్పటికే ఈ హైదరాబాద్ రీజియన్ సేవలను వినియోగించుకుంటున్నాయి. భారత్లో డిజిటల్, ఏఐ మౌలిక సదుపాయాల కోసం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులలో భాగంగా ఈ నూతన రీజియన్ను ప్రారంభించారు.
0 Comments