మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే బీజేపీ నాయకుల పని, బండి సంజయ్ బతుకంతా మతం పేరు చెప్పుకుని బతకడమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా బోనాల పండుగ జరిగిందని ఈ పండగ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడిని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలను సమర్పించాన్నారు. అలాంటిది బండి సంజయ్ బోనాల పండుగను కూడా రాజకీయం కోసం ఉపయోగించుకోవడం మంచి సంస్కృతి కాదన్నారు. తెలంగాణ గౌరవానికి బోనాల పండుగ చాలా ప్రత్యేకమైనదని, అటువంటి బోనాల పండుగకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని బండి సంజయ్ నిన్న చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఇవాళ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. బోనాల కోసం ప్రతి గుడికి నిధులు ఇచ్చామని, రేవంత్ రెడ్డి హయాంలోనే రాష్ట్రంలోని పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడటం కోసం ప్రాచీన దేవాలయాలను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని రూ. 250 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని, బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని రూ.225 కోట్ల అంచనా వ్యయంతో పునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు. కాళేశ్వరం దేవాలయం పునర్నిర్మాణం కోసం రూ. 250 కోట్లు కేటాయించామని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.50 కోట్లు, భద్రాచలం పునర్నిర్మాణం కోసం రూ.351 కోట్ల, గోదావరి పుష్కరాల కోసం రూ.1,000 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ. 300 కోట్లు విడుదల చేశామన్నారు. గోదావరి పుష్కరాల్లో గోదావరి వెంట ఉన్న 96 పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కపల్లిలో రూ.157 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో గోశాల, వేములవాడలో 40 ఎకరాల్లో అధునాతన గోశాలను నిర్మిస్తున్నామన్నారు. దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలను కూడా హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఖర్చు చేస్తోందని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో హిందూ దేవాలయాల అభివృద్ధి జరుగుతుందా? ఇంత పెద్ద ఎత్తున గుళ్లకు నిధులు కేటాయించారా? బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం సెక్యులర్ అని తాము అన్ని మాతాలను గౌరవిస్తామన్నారు. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం మా కాంగ్రెస్ పార్టీది కాదన్నారు. బండి సంజయ్కి నీకు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసి మాట్లాడాలన్నారు.
0 Comments