Ad Code

ఐఐటీ బాంబేతో దక్షిణ మధ్య రైల్వే అవగాహన ఒప్పందం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేతో దక్షిణ మధ్య రైల్వే ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. జంక్షన్ లేదా యార్డ్ సామర్థ్యం/రద్దీని విశ్లేషించడానికి తగిన ఫ్రేమ్‌వర్క్ నమూనాలను అభివృద్ధి చేయడమే ఈ అవగాహన ఒప్పంద లక్ష్యం. ఇది రైల్వే నెట్‌వర్క్ వ్యాప్తంగా భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ డి.ఆంజనేయులు రెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డా. ఆర్. గోపాలకృష్ణన్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఐఐటీ బాంబేకి చెందిన ప్రొఫెసర్ మిలింద్ సోహోని ఆయన బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ బాంబే బృందం గత రెండు సంవత్సరాలుగా ఈ సమస్యపై పనిచేస్తూ, యార్డ్ డయాగ్రామ్‌లు, పాయింట్లపై వేగాలు, రైలు పొడవు, త్వరణ ప్రత్యేకతలు, ఇంటర్‌లాకింగ్ చారిత్రక డేటా లాగర్ సమాచారం వంటి అంశాలను ఉపయోగించింది. అదనంగా, విజువల్ టూల్స్ సన్నివేశ అనుకరణ సాధనాలను వినియోగించి (అదే యార్డ్ ఆకృతిలో రైళ్ల సంఖ్య పెంచడం లేదా ప్రత్యామ్నాయ యార్డ్ ఆకృతులను పరిశీలించి, విశ్లేషణలు నిర్వహించింది. ఈ అవగాహన పత్రం (ఎంవోయూ) ఈ భాగస్వామ్యాన్ని అధికారికం చేస్తోంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం.. రైల్వే డేటా లాగర్ ద్వారా ఉత్పత్తి అయ్యే భారీ పరిమాణంలోని రా సిగ్నలింగ్ డేటాను విశ్లేషించి, దానిని రైలు కదలికలు, సంక్లిష్టమైన నిలుపుదలలు మొదలైన వాటిపై సులభంగా అర్థమయ్యే డేటాగా మార్చేందుకు ఒక అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే పైలట్ ప్రాజెక్ట్‌ను ఐఐటీ బాంబే చేపట్టింది. అభివృద్ధి చేస్తున్న ఈ విశ్లేషణాత్మక సాధనం, సిగ్నలింగ్ రికార్డుల నుంచి రైలు కదలికలను పునర్నిర్మించడానికి నిరంతర ప్రయాణాలు, క్రాసింగ్‌లు, షంటింగ్, డిటెన్షన్‌లు వంటి రైలు కార్యకలాపాల దృశ్యరూపంలో ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విశ్లేషణల ద్వారా రైల్వే అధికారులకు కార్యనిర్వాహణలో ఎదురయ్యే అవరోధాలను గుర్తించడంలో, రైలు నిలుపుదల సరళిని అధ్యయనం చేయడంలో, భద్రతా పర్యవేక్షణను పటిష్ఠం చేస్తూ రైలు నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ పైలట్ ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తారు. తొలి దశలో డేటా ధ్రువీకరణ, రైళ్ల కదలికల విశ్లేషణ, విజువలైజేషన్ సాధనాలు భద్రత, సామర్థ్య కొలమానాల అభివృద్ధితో ప్రారంభమవుతుంది. పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా, ఈ సంయుక్త భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా పెద్ద రైల్వే స్టేషన్ లేఅవుట్‌లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం, అధునాతన విశ్లేషణాత్మక డ్యాష్‌బోర్డులను అభివృద్ధి చేయడం, అలాగే రియల్-టైమ్ రైలు కదలికల విశ్లేషణ కార్యాచరణకు అవసరమైన మద్దతు అందించే విధంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలతో సమగ్ర అనుసంధానం కల్పించడం వంటి తదుపరి చర్యలను చేపట్టాలని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఐఐటీ బాంబేతో భాగస్వామ్యం ఏర్పడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ రైల్వే ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించే ఒక మార్గాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సహకారం సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైలు రద్దీ నిరంతరం పెరుగుతోందని, అయితే యార్డులు రద్దీగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉండటం వల్ల మౌలిక సదుపాయాల విస్తరణ, ముఖ్యంగా యార్డులలో, చాలా పరిమితంగా ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టే ప్రతి పెట్టుబడికి జాగ్రత్తతో కూడిన విశ్లేషణ, పటిష్ఠమైన ఇంజనీరింగ్ తోడ్పాటు ఉండటం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. జనరల్ మేనేజర్ మాట్లాడుతూ వివిధ పరిస్థితులను అనుకరించడానికి, పరస్పర చర్యల కారకాల ప్రభావాలను విశ్లేషించడానికి వీలు కల్పించే ఈ రకమైన అత్యాధునిక సాధనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుందని తెలిపారు. యార్డ్ పునర్నిర్మాణం ఇంటర్‌లాకింగ్ విధానాల్లో చిన్న మార్పులు కూడా రైళ్ల కదలికలపై బలమైన ప్రభావాన్ని చూపుతాయని, దీనిని ముందుగా ఊహించలేమని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే, ఐఐటీ బాంబే మధ్య కుదిరిన ఒప్పందం కచ్చితంగా సహాయపడుతుందని జనరల్ మేనేజర్ అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu