ఇథనాల్ విధానానికి వ్యతిరేకంగా 2.33 లక్షల మందికి పైగా సంతకం చేసిన వినతి పత్రాన్ని రేపు ప్రధాని నివాసానికి వెళ్లి స్వయంగా అందజేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "కొన్ని రోజుల క్రితం ప్రధానికి ఉద్దేశించి ఆన్లైన్ వినతిపత్రం ప్రారంభించాం. చాలా తక్కువ సమయంలోనే సుమారు 2,33,238 మంది దానిపై సంతకం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నా కార్యాలయం నుంచి 100 మందితో కలిసి ప్రధాని నివాసానికి బయలుదేరుతాను.ఈ వినతిపత్రాన్ని ఆయనకు స్వయంగా అందించి, ఇథనాల్ విధానంలో ఉన్న లోపాల గురించి చర్చించాలని కోరతాం" అని అన్నారు. అంతకుముందు శనివారం న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ బయట నిర్వహించిన టౌన్హాల్ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. "గతంలో ప్రధానికి ఉద్దేశించిన వినతిపత్రంపై సంతకం చేయాలని మిమ్మల్ని కోరాను. 2,00,000 మందికి పైగా ఆన్లైన్లో సంతకం చేశారు. ఆ సంతకాల ప్రింట్లను తీసుకున్నాను. మంగళవారం 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నేను స్వయంగా ప్రధాని నివాసానికి వెళ్లి ఆ వినతిపత్రాన్ని అందజేస్తాను" అని చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావాల్సిన అవసరం లేదని, పోలీసుల చర్యలకు భయపడని వారిని మాత్రమే వెంట తీసుకెళ్తానని అన్నారు. "అందరూ రావాల్సిన అవసరం లేదు. పోలీసుల లాఠీచార్జీకి భయపడని 100 మందిని తీసుకెళ్తాను. జైలుకు వెళ్లడానికి భయపడని 100 మందిని తీసుకెళ్తాను. రావాలనుకునే వారు నాకు రాయండి, నన్ను ట్యాగ్ చేసి సందేశం పంపండి. 100 మందితో కలిసి ప్రధాని నివాసం వైపు పాదయాత్ర చేస్తాం. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూద్దాం" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
0 Comments