Ad Code

ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం

చాలా కాలం నుంచి ఉద్యోగ సంఘాలు ఈపీఎఫ్ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.  ఉద్యోగుల పీఎఫ్ కు సంబంధించిన పెన్షన్ పొదుపు మరింతగా పెరగనుంది. దీనిపై కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆ తర్వాతే కొత్త పరిమితి అమలులోకి వచ్చే తేదీపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ కొత్త పరిమితి అమలులోకి రావడంతో 15000 నుంచి 25 వేల రూపాయల వరకు వేతనం ఉండే ఉద్యోగులకు కూడా భవిష్యత్తు కోసం పొదుపు, పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. దీని వల్ల ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సామాజిక భద్రత పెరగడంతో వారికి మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం చేయనున్న ఈ మార్పు ప్రభావం కంపెనీలపై పడుతుంది. కంపెనీలు ఎక్కువ వాటా చెల్లించాల్సి వస్తుంది. దీంతో వారి పేరోల్ ఖర్చు మరింత పెరగవచ్చు. ఈపీఎఫ్ వ్యవస్థలో యజమాని బేసిక్ జీతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్ కు చెల్లిస్తాడు. ప్రభుత్వం 1.16 శాతం వాటా ఇస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఖర్చులు సైతం పెరుగుతాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో ఈపీఎఫ్ కోసం కేంద్రం 11,144 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. కేబినెట్ ఆమోదం తర్వాత కంపెనీలు తమ పేరోల్ సిస్టమ్, అవసరమైన ప్రక్రియల్లో మార్పులు చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. అందువల్ల ఈ రూల్ తక్షణమే అమలులోకి రాదు. ప్రస్తుతం కొత్త ఈపీఎఫ్ వేతన పరిమితి 1 ఏప్రిల్ 2027 నుంచి అమలులోకి రావచ్చని భావిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu