Ad Code

కంగనా రనౌత్ ను సొంత పార్టీలోని వారే పెద్దగా పట్టించుకోరు : కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎద్దేవా

కాక్రోచ్ జనతా పార్టీతో పాటు జెన్ జీ నిరసనకారుల్ని ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రెండు రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ కంగనకు ఘాటు సమాధానం ఇచ్చింది. కంగనను ఆమె సొంత పార్టీ బీజేపీయే సీరియస్ తీసుకోదని తేల్చిచెప్పింది. నిరసనల్లో పాల్గొన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కంగనా రనౌత్.. "వారు మత్తుపదార్థాలు, మద్యం సేవించే స్వేచ్ఛను గర్వంగా ప్రదర్శిస్తారు, సిగ్గులేకుండా తమ తల్లిదండ్రుల సంపాదనతో బతుకుతారు, నేను వారిని 'జనరేషన్ గట్టర్' అని పిలుస్తాను. వారిలో కొందరు వ్యవస్థకు అందించడానికి ఏమీ లేనివారు. వారు చదువులో రాణించరు. వారు ఎంత అసహ్యంగా, అవినీతిపరులుగా ఉన్నారంటే, కనీసం గృహిణులుగా కూడా ఉండలేరు." అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. కంగన సారీ చెప్పాలంటూ ఇప్పటికే రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఘాటుగా స్పందించారు. "చూడండి, కంగనా రనౌత్ సొంత పార్టీలోని వారే ఆమెను పెద్దగా పట్టించుకోరు లేదా ఆమెను సీరియస్‌గా తీసుకోరు, అలాంటప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? 'జెన్ జీ''జెన్ ఆల్ఫా' లేదా మరే ఇతర యువ తరానికి చెందినవారైనా ఆమెను సీరియస్‌గా తీసుకుంటారని గానీ, ఆమె చెప్పేది వింటారని గానీ నేను అనుకోను," అని దాస్ అన్నారు. ఆమె ఇప్పుడు ఒక రాజకీయ నాయకురాలని, హిమాచల్‌లోని తన నియోజకవర్గంలో ఆమె పర్యటించినప్పటి వీడియోలు ఉన్నాయని, ఎంపీగా పెద్దగా పని ఉండదని తాను భావించానని, కానీ వాస్తవానికి దానికి చాలా శ్రమ అవసరమని ఆమె అందులో పేర్కొన్నారన్నారు. ఆమె చిత్తశుద్ధి స్థాయిని ఇది తెలియజేస్తుందన్నారు. ఆమె తమను అశ్రద్ధ గల తరం అంటోంది, కానీ ఆమె స్వయంగా తన అశ్రద్ధను బయటపెట్టుకున్నారని దాస్ ఎద్దేవా చేశారు.

Post a Comment

0 Comments

Close Menu