కెనడాలో పంజాబ్ యువతి హత్య

కెనడాలోని టొరంటోలో భారత సంతతికి చెందిన 26 ఏళ్ల యువతి నవనీత్ కౌర్‌ని ఓ దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడు. ఆమె రోడ్డుపై వెళ్తుండగా వెంబడించి మరి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.  ఈ సంఘటన జూలై 24వ తేదీ ఉదయం జరిగింది. భారత సంతతికి చెందిన శరణ్‌జీత్ బ్రాంప్టన్ నివాసి కాగా, నిందితుడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ అభియోగాలు ఉన్నట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. యువతిని కొద్దిదూరం వెంబడించిన నిందితుడు ఆమెతో ఏదో మాట్లాడి వెంటనే కాల్చిచంపాడు. ఒంటారియో పోలీసుల ప్రకారం జూలై 24, శుక్రవారం ఉదయం 7.23 గంటల ప్రాంతంలో హంబర్‌వుడ్ బౌలేవార్డ్, రెక్స్‌డేల్ బౌలేవార్డ్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అప్పటికే కౌర్ రక్తపుమడుగులో కనిపించింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినప్పటికీ అక్కడికక్కడే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. విచారణలో కౌర్‌ను కాల్చి చంపడానికి ముందు మృతురాలు, నిందితుడి మధ్య కొద్దిసేపు సంభాషణ జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే శరణ్‌జీత్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలంలో ఓ ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు. బాధితురాలు హంబర్‌వుడ్ బౌలేవార్డ్‌లో నడుస్తుండగా ఒక వ్యక్తి ఆమెను వెంబడించినట్టు తెలిపాడు. ఆ తర్వాత నిందితుడు బాధితురాలితో ఏదో చెప్పి ఆమెపై కాల్పులు జరిపి చేతిలో తుపాకితో పారిపోయాడు. ఆ యువతిని చూసి సాక్షి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నవనీత్ హత్య ఉద్దేశపూర్వక దాడిగా కనిపిస్తోందని విచారణ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు.


Post a Comment

0 Comments