అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌ లోని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటకొండ పంచాయతీ, బీఎస్‌ఆర్‌ వడ్డిపల్లికి చెందిన మహేష్‌, రవళి (18)ని పది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో నాలుగు నెలల గర్భవతి రవళి తీవ్ర మనోవేదనకు గురైంది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్‌ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్‌ఐ అనీల్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments