ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైలాండ్ రోడ్డులో గత నెల జరిగిన తాళం వేసిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించి, ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను అరెస్టు చేశారు. నిందితులు వెంపాల చంటి, క్రోసూరు శ్రీనివాసరావులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి సుమారు 16 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. గత నెల 17న ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న నిందితులు ముందుగా ఇంటిని రెక్కీ నిర్వహించి, అనంతరం తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు గొలుసు, ఐదు ఉంగరాలు, నగదును అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో వెంపాల చంటిపై వందకు పైగా కేసులు, క్రోసూరు శ్రీనివాసరావుపై 28 కేసులు ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం ఇద్దరినీ మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ సందర్భంగా రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ, ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ముందుగానే పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే ఎల్‌హెచ్‌ఎంఎస్‌ (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) సేవలను వినియోగించుకోవాలని కోరారు.ఎల్‌హెచ్‌ఎంఎస్‌లో నమోదైన ఇళ్లను రాత్రి వేళల్లో బీట్ సిబ్బంది ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారని, ప్రస్తుతం తక్కువ ధరలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నందున ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

Post a Comment

أحدث أقدم