కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పిన మెటా

భారత ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో కొద్దిసేపు నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు మెటా చెప్పింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, సాంకేతిక లోపం వల్ల జరిగిన పొరపాటని వివరణ ఇచ్చింది. లోపాన్ని గుర్తించిన వెంటనే ఆ వీడియోను తిరిగి యథావిధిగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మెటా ప్రతినిధి వెల్లడించారు. జులై 23న ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు. దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జెన్ జీ యువతను ఉద్దేశించి ప్రధాని మాట్లాడిన సందేశం అందులో ఉంది. పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠినమైన చట్టాలు తీసుకువస్తామని అందులో హామీ ఇచ్చారు. అయితే, జులై 28 అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ వీడియోను తెరవడానికి ప్రయత్నించిన వినియోగదారులకు.చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలో (ఇండియాలో) వీడియోను నిలిపివేశాం” అనే సందేశం కనిపించింది. ఈ వార్త వ్యాపించడంతో మెటా తక్షణమే స్పందించి సాంకేతిక పొరపాటైందని పేర్కొంటూ వీడియోను పునరుద్ధరించింది. ప్రధాని స్థాయి వ్యక్తికి చెందిన అధికారిక వీడియోను ఇలా నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. మెటా ఇచ్చిన వివరణతో పాటు అసలు ఆ వీడియో ఏ పరిస్థితుల్లో రీజినల్ బ్లాకింగ్‌కు గురైందో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ అంశంపై పూర్తి స్థాయి స్పష్టత మరియు వివరణ ఇవ్వాలని మెటా, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నతాధికారులను పిలిపించి సమన్లు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ మోడరేషన్, ఆటోమేటెడ్ అల్గారిథమ్స్ పనితీరుపై ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Post a Comment

0 Comments