తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు మైనర్ బాలిక, ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్కుమార్ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్కుమార్ సెల్ఫీ వీడియో, అతడి మొబైల్ ఫోన్లో లభించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడి మరణం ఆత్మహత్యేనా? లేదంటే ఇతర కోణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జులై 10 తేదీ అర్ధరాత్రి సమయంలో రాజ్కుమార్ దైవాలగూడలో నరమేధం సృష్టించాడు. రెండు రోజుల తర్వాత.. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్కుమార్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. రాజ్కుమార్ మొబైల్ ఫోన్లో పోలీసులు గుర్తించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో తనపై నమోదైన పోక్సో కేసు, తన జీవితంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. బాధితులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు కొన్ని గంటల ముందే ఈ వీడియోను రికార్డు చేసినట్లు గుర్తించారు. అలాగే రాజ్కుమార్ రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. రాజ్కుమార్ మృతికి సంబంధించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ఫీ వీడియో, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
షాబాద్ నిందితుడు పార్వతి రాజ్కుమార్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు
الجمعة، 17 يوليو 2026
case was registered based on a selfie video and details found on his mobile phone Police Register Case Regarding the Death of Shabad Accused Parvathi Rajkumar
ليست هناك تعليقات:
إرسال تعليق