కార్పొరేట్ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓల జాబితాలో శంఖ్ మిత్ర

అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త శంఖ్ మిత్ర నిలిచారు. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్'  ఇటీవల విడుదల చేసిన ఎస్ అండ్ పి 500 కంపెనీల సీఈఓల వార్షిక వేతన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'వెల్‌టవర్' సీఈఓ మరియు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శంఖ్ మిత్రకు 2025 ఆర్థిక సంవత్సరానికి గాను లభించిన మొత్తం పరిహారం విలువ 821 మిలియన్ డాలర్లు. శంఖ్ మిత్రకు లభించిన ఈ భారీ ప్యాకేజీలో 99 శాతం వాటా నగదు రూపంలో కాకుండా కంపెనీ షేర్ల రూపంలోనే ఉంది. అయితే ఈ షేర్ల బదిలీకి సంస్థ కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను మరియు కఠినమైన నిబంధనలను విధించింది. మొదటి సగం షేర్లు: శంఖ్ మిత్ర కనీసం 2031 వరకు వెల్‌టవర్ సంస్థలోనే సీఈఓగా కొనసాగితేనే ఇందులో సగం షేర్లు ఆయనకు దక్కుతాయి. రాబోయే ఐదేళ్లలో కంపెనీ మార్కెట్ విలువను 45 శాతం మేర వృద్ధి చేయడంతో పాటు, కీలక స్టాక్ మార్కెట్ సూచీలను అధిగమిస్తేనే మిగిలిన సగం వాటా బదిలీ అవుతుంది. 1981లో జన్మించిన 45 ఏళ్ల శంఖ్ మిత్ర పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో పెరిగారు.  కోల్‌కతాలోని ప్రసిద్ధ 'జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం' నుండి ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్ళి ప్రతిష్టాత్మక 'కొలంబియా బిజినెస్ స్కూల్' నుండి అప్లైడ్ వాల్యూ ఇన్వెస్టింగ్‌లో ఎంబీఏ పట్టా పొందారు. తన వృత్తిపరమైన కెరీర్‌ను ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ 'ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్' (PwC) లో ప్రారంభించారు. ఆ తర్వాత ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, సిటాడెల్, మిలేనియం పార్ట్‌నర్స్ వంటి ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల్లో కీలక పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా వెల్‌టవర్ సంస్థలో చేరిన శంఖ్ మిత్ర.. తన వ్యూహాత్మక ఆలోచనలు, డేటా ఆధారిత నిర్ణయాలతో సంస్థను అగ్రపథంలో నిలిపారు. ఆయన ప్రతిభను గుర్తించిన బోర్డు, అక్టోబర్ 2020లో ఆయన్ను సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికతో ఆయన పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతోంది.

Post a Comment

0 Comments