హైదరాబాద్, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్నగర్ లంబగుండు ప్రాంతంలో 'సర్' జాబితాలో తన పేరు లేదనే తీవ్ర మనస్తాపంతో, త్వరలోనే పోలీసులు తనను జైలుకు పంపుతారేమోనన్న భయంతో ఒక కారు డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యులు , పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్నగర్ ప్రాంతానికి చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్ (51) కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఇటీవల ఎస్ఐఆర్ లిస్టులో తన పేరు లేకపోవడాన్ని గమనించిన ముజీబుర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. లిస్టులో పేరు లేనందున పోలీసులు తనను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారేమోనని భయపడ్డాడు. ఒకవేళ తను జైలుకు వెళ్తే తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారు? వారి భవిష్యత్తు ఏంటని గత కొన్ని రోజులుగా తీవ్రంగా మదనపడ్డాడు. ఈ విషయమై శనివారం రాత్రి ముజీబుర్ రహ్మాన్ భార్య ఇస్మాయిల్బీ అతనికి ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ఎలాంటి ఇబ్బంది రాదని, అధైర్యపడవద్దని అనునయించినప్పటికీ అతనిలో ఆందోళన తగ్గలేదు. తీవ్ర మనస్తాపంతో రాత్రంతా మదనపడిన ముజీబుర్.. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక ఘోర నిర్ణయం తీసుకున్నాడు. తన ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయాన్నే ముజీబుర్ రహ్మాన్ ఉరికి వేలాడుతుండటం గమనించిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్థానికుల సమాచారం మేరకు బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలుగా మారి కన్నీరుమున్నీరవుతున్నారు.
'సర్' జాబితాలో పేరు లేదనే తీవ్ర మనస్తాపంతో కారు డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య
الاثنين، 29 يونيو 2026
Bharatnagar Lambagundu area Car Driver Commits Suicide After Name Missing from 'SIR' List national telangana under the jurisdiction of the Borabanda police station in Hyderabad
ليست هناك تعليقات:
إرسال تعليق