నేపాల్ లో ప్రధానమంత్రి బాలెన్ షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే హోంమంత్రి సుదన్ గురుంగ్ ఈరోజు రాజీనామా పత్రాన్ని ప్రధాని బాలెన్ షాకు సమర్పించారు. ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి గురుంగ్‌పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా వ్యతిరేకత కూడా తీవ్రం కావడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన అతి తక్కువ సమయంలోనే కీలక మంత్రి రాజీనామా చేయడం ప్రధాని బాలెన్ షా ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గురుంగ్‌పై ఉన్న ఆరోపణలలో ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉండటంతో పాటు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద వ్యాపారవేత్త దీపక్ భట్టాకు చెందిన సంస్థలలో షేర్లు కొనుగోలు చేసినట్లు ఆధారాలు బయటపడటం ఈ రాజీనామాకు దారితీసింది. భట్టా మనీ లాండరింగ్ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న వ్యక్తి. తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి, నిష్పాక్షిక విచారణకు సహకరించాలనే నైతిక బాధ్యతతోనే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సుదన్ గురుంగ్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఆయన రాజీనామా నిర్ణయానికి మరింత బలం చేకూర్చింది. ప్రధాని బాలెన్ షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాఠ్మండుతో సహా పలు ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలకు దిగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత ప్రజా అసంతృప్తికి ముఖ్య కారణం భారత్‌తో ముడిపడి ఉన్న సరిహద్దు నిబంధనలే. వంద నేపాలీ రూపాయల (సుమారు భారత ₹62) కంటే ఎక్కువ విలువైన భారత వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ విధించడం ప్రజాగ్రహానికి కారణమైంది. రోజువారీ అవసరాలకు భారత్‌పై ఆధారపడే సరిహద్దు ప్రాంత ప్రజలకు ఈ కొత్త నిబంధనల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి బాలెన్ షాకు, తన కేబినేట్ మంత్రి అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయడం తీవ్ర ప్రతికూలతగా మారింది. 

Post a Comment

أحدث أقدم