దివాలా తీసిన జేఏఎల్‌ కొనుగోలు : అదానీ గ్రూప్‌ వైపు మొగ్గు చూపిన జైప్రకాశ్‌ గౌర్‌


దివాలా తీసిన  జేఏఎల్‌ సంస్థ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్‌ వైపు జేపీ గ్రూప్‌ వ్యవస్థాపకుడు జైప్రకాశ్‌ గౌర్‌ మొగ్గు చూపారు. గౌతమ్‌ అదానీ సారథ్యంలో గ్రూప్‌ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్‌ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్‌ పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్‌ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్‌లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్‌ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్‌ ఆరోపించిన నేపథ్యంలో గౌర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్‌లో జేఏఎల్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్‌ బిడ్‌కు గతేడాది నవంబర్‌లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (అలహాబాద్‌ బెంచ్‌) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్‌ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్‌ ట్రిబ్యునల్‌ ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్‌సీఎల్‌ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్‌సీఎల్‌టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది.

Post a Comment

0 Comments