ఆన్ లైన్ గేమింగ్ నిషేధం బిల్లుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కొత్తగా ఆన్లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవలు, సమాచార ప్రసారాలు, యువజన వ్యవహారాలు, క్రీడలు, న్యాయ వ్యవహారాల శాఖల జాయింట్ కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించే ఈ వ్యవస్థతో పాటు 2025 నాటి ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ చట్టంలో పొందుపరిచిన సవరణలు, ఇతర నియమాలు, నిబంధనలన్నీ కూడా మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఓ డిజిటల్ కార్యాలయంగా అథారిటీ ఉంటుంది. ఈ- స్పోర్ట్స్తో సహా అన్ని రకాల ఆన్లైన్ గేమ్లను గుర్తించి, వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. అంతేకాకుండా డేటా రిటెన్షన్, అలాగే ఇతర నియంత్రణ మార్గదర్శకాలను జారీ చేసే పూర్తి అధికారాలు ఈ అథారిటీకి ఉంటాయి. కొత్త ఫ్రేమ్వర్క్ ద్వారా రిజిస్ట్రేషన్ నిబంధనలను సరళీకరించింది. కంపెనీలు ఈ అథారిటీకి దరఖాస్తు సమర్పించడం ద్వారా ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని రకాల గేమ్లకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరమని నిబంధనలు స్పష్టంగా పేర్కొన్నాయి. పెద్ద సంఖ్యలో యూజర్లు పాల్గొనే గేమ్లు, ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్నవి, అధిక ప్రమాదకరంగా పరిగణించే వాటికి ఇది వర్తిస్తుంది. ఆన్ లైన్ గేమింగ్ కార్యకలాపాలను నియంత్రించడం, నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడే సంస్థపై చర్యలు తీసుకోవడం వంటివి ఈ అథారిటీ పరిధిలోకి వస్తాయి.
إرسال تعليق