దేశంలో మొట్టమొదటి 'ఎల్పీజీ ఏటీఎం'ను భారత్ పెట్రోలియం ప్రారంభించింది. గ్యాస్ అయిపోయిందని కంగారు పడాల్సిన అవసరం లేకుండా, అర్ధరాత్రి అయినా సరే చిటికెలో సిలిండర్ పొందే ఈ 'స్మార్ట్' ముచ్చట ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గురుగ్రామ్ నగరం సాంకేతికతలో మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే 'స్మార్ట్ వెండింగ్ మెషీన్'ను ఇక్కడ ప్రవేశపెట్టారు. భారత్ పెట్రోలియం పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా సోహ్నాలోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఈ 'ఇన్స్టా ఎల్పీజీ' ఏటీఎంను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తమకు నచ్చిన సమయంలో, కేవలం రెండు మూడు నిమిషాల్లోనే గ్యాస్ సిలిండర్ను పొందే వెసులుబాటును ఇది కల్పిస్తోంది. ఈ ఏటీఎం ద్వారా పంపిణీ చేసే సిలిండర్లు సాధారణ ఇనుప సిలిండర్లలా ఉండవు. ఇవి ఫైబర్తో తయారైన 'కాంపోజిట్ సిలిండర్లు'. సాధారణ 14 కిలోల గ్యాస్ సిలిండర్ మొత్తం బరువు 31 కిలోలు ఉంటే, ఈ కాంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. దీనివల్ల వీటిని తీసుకెళ్లడం చాలా సులభం. ఈ సిలిండర్లు పాక్షికంగా పారదర్శకంగా ఉండటం వల్ల లోపల గ్యాస్ ఎంత ఉందో కంటితోనే చూసి తెలుసుకోవచ్చు. వీటికి తుప్పు పట్టదు, దుమ్ము చేరదు. పాత సిలిండర్ల కంటే ఇవి అత్యంత సురక్షితమైనవని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయగానే వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఉన్న ఖాళీ సిలిండర్పై ఉన్న క్యూఆర్ కోడ్ను మెషీన్ వద్ద స్కాన్ చేయాలి. యూపీఐ లేదా డెబిట్ కార్డు ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు కట్ అవ్వగానే మెషీన్ ఖాళీ సిలిండర్ను లోపలికి తీసుకుని, నిండుగా ఉన్న కొత్త సిలిండర్ను బయటకు పంపిస్తుంది. సాధారణంగా గ్యాస్ డెలివరీ బాయ్స్ కోసం ఎదురుచూడటం, వారు వచ్చే సమయానికి ఇంట్లో ఉండటం అనేది ఉద్యోగస్తులకు పెద్ద సమస్యగా ఉండేది. ఈ ఏటీఎం అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. "ఇప్పుడు మేము డెలివరీ షెడ్యూల్స్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. 24x7 ఎప్పుడైనా గ్యాస్ తెచ్చుకోవచ్చు" అని స్థానిక నివాసి రాజీవ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఈ మెషీన్లో ఒకేసారి 10 సిలిండర్లను నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. స్టాక్ తగ్గగానే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి ఆటోమేటిక్గా అలర్ట్ వెళ్లిపోతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ గనుక విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరిన్ని నివాస ప్రాంతాల్లో ఇటువంటి ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని బీపీసీఎల్ భావిస్తోంది. ఇది గృహాలకు వంట గ్యాస్ అందుబాటులో ఉండే విధానాన్నే పూర్తిగా మార్చివేస్తుందని ఆశిస్తున్నారు.
'ఇన్స్టా ఎల్పీజీ' ఏటీఎం : గురుగ్రామ్ లో పైలట్ ప్రాజెక్ట్
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق