నెదర్లాండ్స్ కు చెందిన ఆప్టివర్ అనే కంపెనీలో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ రూ.2.5కోట్ల ప్యాకేజీ అందుకున్నాడు. ఐఐటీహెచ్ ప్రకారం, సంస్థ చరిత్రలో ఒక విద్యార్థికి లభించిన అత్యధిక ప్యాకేజీ ఇదే. ఫైనలియర్ విద్యార్థి అయిన ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ జూలై నుండి గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ అయిన ఆప్టివర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన పనిని ప్రారంభించనున్నారు. 21 ఏళ్ల వర్గీస్ రెండు నెలల ఇంటర్న్షిప్ను ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్గా మార్చుకోవడం ద్వారా ఈ ఉద్యోగాన్ని పొందాడు. “నేను ఇంటర్వ్యూ ఇచ్చిన మొదటి, ఏకైక కంపెనీ ఇదే. ఆ సంస్థ నాకు ఉద్యోగ ప్రతిపాదన చేయబోతోందని నా గురువు సూచించినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. నా తల్లిదండ్రులు కూడా అంతే సంతోషించారు” అని వర్గీస్ తెలిపాడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వర్గీస్ 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు బెంగళూరులో చదువుకున్నాడు. జాబ్ మార్కెట్లో మందగమనం ఉన్నప్పటికీ, తాను మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధిస్తానని ఎప్పుడూ నమ్మకంగా ఉన్నానని చెప్పాడు. ఐఐటీ అనే గుర్తింపు మా క్యాంపస్కు కంపెనీలను ఆకర్షిస్తుందని, ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని నాకు తెలుసు. అంతేకాకుండా, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే నేను కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్లో పాల్గొంటూ దేశంలోనే టాప్ 100లో ఉండేవాడిని. విస్తృత శ్రేణి కోర్సులను ఎంచుకునే అవకాశం కల్పించిన పాఠ్యప్రణాళికతో పాటు, అది కూడా నాకు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి సాయపడింది. నాకు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ లభించడం అదృష్టమని భావిస్తున్నానని వర్గీస్ అన్నాడు. వర్గీస్ తల్లిదండ్రులు ఇద్దరూ ఇంజనీర్లే కావడం గమనార్హం. ఆప్టివర్లో ఇంటర్న్షిప్ కోసం ఇద్దరు విద్యార్థులు ఎంపిక కాగా, వర్గీస్కు మాత్రమే ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ లభించింది. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్లో రెండు వారాల శిక్షణ, ఆరు వారాల ప్రాజెక్ట్ ఉన్నాయి. అతను ఆ సంస్థ నెదర్లాండ్స్ కార్యాలయంలో పూర్తికాల ఉద్యోగిగా పనిచేయనున్నాడు. వర్గీస్తో పాటు, ఐఐటీహెచ్లో చదువుతున్న మరో సీఎస్ఈ విద్యార్థి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. ఇది ఆ సంస్థకు ఒక కొత్త మైలురాయిని నెలకొల్పింది. ఇప్పటి వరకు, ఐఐటీహెచ్ విద్యార్థికి లభించిన అత్యధిక ప్యాకేజీ సుమారు కోటి రూపాయలుగా ఉండేది. ఇది 2017లో నమోదైంది. 2025 సంవత్సరం కేవలం ఆ పరిస్థితిని మార్చడమే కాకుండా 2024తో పోలిస్తే ఇన్స్టిట్యూట్లో సగటు ప్యాకేజీ సుమారు 75% పెరగడానికి కూడా కారణమైంది. అంటే.. ప్యాకేజీ రూ.20.8 లక్షల నుండి రూ. 36.2 లక్షలకు చేరడం విశేషం. డిసెంబర్లో ముగిసిన ప్లేస్మెంట్ల మొదటి దశలో ఈ సంవత్సరం విద్యార్థులు మొత్తం 24 అంతర్జాతీయ ఆఫర్లను పొందారు. ప్రస్తుతం, 650 మంది పీజీ విద్యార్థులలో 196 మందికి సగటున రూ. 22 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించాయి. యూజీ విద్యార్థుల విషయానికొస్తే, ప్లేస్మెంట్ల కోసం నమోదు చేసుకున్న 487 మంది విద్యార్థుల్లో 62 శాతం మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
ఆప్టివర్ కంపెనీ నుంచి రూ.2.5 కోట్ల ప్యాకేజీ అందుకున్న ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి వర్గీస్ !
الجمعة، 2 يناير 2026
Born and raised in Hyderabad IIT Hyderabad student Varghese receives a Rs. 2.5 crore package from Optiver science technology Varghese's parents are engineers
ليست هناك تعليقات:
إرسال تعليق