జీ20 సదస్సులో ఆప్యాయంగా పలకరించుకున్ననరేంద్ర మోడీ, జార్జియా మెలోని


ప్రధాని నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. వారు అంతర్జాతీయ వేదికలపై కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటారు. అనేక సందర్భాల్లో వారు కలుసుకున్న దృశ్యాలు 'మెలోడీ' పేరుతో నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. జీ20 లీడర్స్ సమ్మిట్ ప్రారంభ సెషన్‌కు ముందు జోహన్నెస్‌బర్గ్‌లోని నాస్రెక్ వద్ద ఇద్దరు అగ్రనేతలు కరచాలనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెలోని ఎదురుపడడంతో మోడీ చిరునవ్వులు చిందిస్తూ ఆత్మీయంగా పలకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రధాని మోడీ, జార్జియా మెలోని చివరిసారిగా జూన్‌లో కెనడాలోని కనానాస్కిస్‌లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య బలమైన సంబంధాలకు నిదర్శనంగా, ప్రధాని మోడీ జార్జియా మెలోని ఆత్మకథ అయిన 'ఐ యామ్ జార్జియా' పుస్తకానికి రాసిన ముందుమాట అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ ముందుమాటలో ప్రధాని మోడీ భారత్, ఇటలీ మధ్య ఉన్న సాన్నిహిత్యం "పంచుకోబడిన నాగరికత ప్రవృత్తులు" అంటే వారసత్వాన్ని పరిరక్షించడం, సమాజంలోని బలం,'గైడింగ్ ఫోర్స్'గా స్త్రీత్వం ఔన్నత్యాన్ని చాటడం వంటి అంశాలపై ఆధారపడి ఉందని రాశారు. ప్రధాని మోడీ రాసిన ముందుమాటపై జార్జియా మెలోని స్పందిస్తూ.. "ప్రధాన మంత్రి నరేంద్ర మోదీగారు 'ఐ యామ్ జార్జియా' పుస్తకం భారతీయ ఎడిషన్‌కు రాసిన ముందుమాట నాకు ఎంతో గౌరవాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ఆయనపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ భావాలు నేను మనస్ఫూర్తిగా తిరిగి తెలియజేస్తున్నాను, ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న బలమైన బంధాన్ని ధ్రువీకరిస్తుంది" అని ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ Adnkronos ద్వారా పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ G20 సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రీమియర్ లీ కియాంగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సహా పలువురు ప్రపంచ నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు బహిష్కరించారు. వర్తకం, వాతావరణ మార్పులపై ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం వంటి దక్షిణాఫ్రికా ప్రాధాన్యతలు అమెరికా విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ప్రభుత్వం పేర్కొంది.

Post a Comment

0 Comments