హైదరాబాద్ లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఛార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలోఛార్జింగ్ పాయింట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఎలక్ట్రిక్ కారులో ఛార్జింగ్ అయిపోవడంతో, హైదరాబాద్ నగరంలోని పలు ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఛార్జింగ్ పెట్టుకునేందుకు కారు ఓనర్ ఆగాడు. ఛార్జింగ్ పాయింట్ల వద్ద చార్జర్లు కట్ చేసి ఎత్తుకెళ్లడం గమనించి ఆశ్చర్యపోయిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈవీ వాహనదారులు కోరుతున్నారు. ఛార్జింగ్ గన్స్ చోరీ కావడం ఇదే మొదటిసారి కాదు. నగరంలో ఛార్జింగ్ పాయింట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు గానీ నిర్వహణ లోపం క్లియర్ గా కనిపిస్తుంది. చాదర్ఘాట్ ఇసామియా బజార్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ వద్ద కూడా గత మార్చి నెలలో ఇలాగే ఛార్జింగ్ గన్స్ ను ఎత్తుకెళ్లారు. ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలతో పోలిస్తే జీహెచ్ఎంసీ ఈవీ చార్జింగ్ సెంటర్లలో ఛార్జింగ్ పెడితే అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ స్టేషన్లను 60 కిలోవాట్స్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఒక్కో కారు 20 యూనిట్స్కి పైగా కెపాసిటీతో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని ఛార్జింగ్ సెంటర్లలో ఛార్జింగ్ పెడితే 35 నుంచి 40 నిమిషాల్లోనే బ్యాటరీ పూర్తిగా నిండిపోతుంది. గ్రేటర్లో 200కు పైగా ప్రైవేట్ ఛార్జింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో యూనిట్కు 20 నుంచి 25 వరకు డబ్బులు తీసుకుంటున్నారు. 18 శాతం జీఎస్టీ కూడా వసూలు చేస్తున్నారు. అదే జీహెచ్ఎంసీ సెంటర్ల దగ్గర యూనిట్కి రూ.13తో పాటు 18 శాతం జీఎస్టీ కలిపి రూ.15.34 వరకు మాత్రమే వసూలు చేస్తున్నారు. పేమెంట్ కూడా టీఎస్ఈవీ యాప్ ద్వారా చేసేందుకు అవకాశం ఉంటుంది.
0 Comments