లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీం 2024 పేరుతో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రొత్సహించేందుకు సరికొత్త స్కాలర్ షిప్ స్కీము తీసుకువచ్చింది. దీని కింద ప్రతిభ ఉన్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్నిఅందిస్తుంది. ఎల్ఐసీ ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. 2021-22, 2022-23 అదే విధంగా 2023-24 విద్య సంవత్సరాల్లో పదవ తరగతి లేదా ఇంటర్ లేదా డిప్లొమా లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులు అవుతారు. వీరు గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థ నుంచి కనీసం 60శాతం మార్కులైనా సాధించాలి. లేదా దీనికి సమానమైన సీజీపీఏ గ్రేడ్ కలిగి ఉండాలి. 2024-25లో ఉన్నత విద్య చదవాలని అనుకునే బాలబాలికలకు జనరల్ స్కాలర్ షిప్స్ అందిస్తుంది. మెడిసిన్, గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఏదైనా విభాగంలో డిప్లొమా చేయాలనుకుంటున్నా గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వెకేషన్ కోర్సులు చేయాలన్నా లేదా ఐటీఐ చదవాలన్నా ఈ నగదు భరోసా కల్పిస్తారని చెప్పవచ్చు. ఇందులో స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ స్కీమ్ కింద దరఖాస్తులు చేసుకోవాలనుకునే విద్యార్థినులకు రెండేళ్లపాటు స్కాలర్ షిప్స్ అందిస్తారు. పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్ లేదా 10ప్లస్ 2 లేదా ఇతర ఏదైనా విభాగంలో డిప్లొమా కోర్స్ పూర్తి చేయాలనుకున్న వారు ఈ స్పెషల్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ www.licindia.in ద్వారా ఆన్ లైన్ లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ స్కాలర్ షిప్ డెడ్ లైన్ 2024 డిసెంబర్ 22తో ముగుస్తుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం అవుతుంది. కుటుంబ అర్హత సహా స్కాలర షిప్ ఎంత మొత్తం వరకు వస్తుంది..ఇలా చాలా వివరాలు తెలియాల్సి ఉంది.
0 Comments