దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గం అంగీకారం !


హారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. తాజాగా జరిగిన సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు అజిత్‌ పవార్‌తో పాటు ఆయన ఎమ్మెల్యేలంతా మద్దతు పలికినట్లు సమాచారం. అయినప్పటికీ షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎం ఏక్‌నాథ్ షిండేనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే లాడ్లీ బహనా యోజనను సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రారంభించారని, ఇది మహాయుతికి లబ్ది చేకూర్చిందని వారు చెబుతున్నారు. ఏక్‌నాథ్ షిండే సీఎం అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లోనూ, ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రయోజనం చేకూరుతుందని షిండే క్యాంపు అభిప్రాయపడింది. అయితే బీజేపీకి అత్యధిక సీట్లు దక్కినందున దేవేంద్ర ఫడ్నవీస్‌ను సీఎం చేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. కాగా మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది. ఫడ్నవీస్‌ను సీఎం చేయడానికి మహాయుతిలోని అజిత్ గ్రూపు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు. ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని భావిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి కీలక పోర్ట్‌ఫోలియోలు ఇవ్వవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే సమయంలో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు. తాజాగా బీజేపీ అగ్రనాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం జరగనుంది.

Post a Comment

0 Comments