ఆదాయ సర్టిఫికేట్లు, నీటి పన్ను, ఇంటి పన్ను సహా ఇతర పన్నులు సహా సర్టిఫికేషన్లు సులభంగా పొందేలా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో అధికారులు మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతోపాటు అనేక రకాల సేవలను వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంది. త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రభుత్వ సేవలు అన్నీ వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు మెటా సంస్థ ముందుకువచ్చినట్లు లోకేష్ వెల్లడించారు. పూర్తి పారదర్శకంగా అనేక సర్టిఫికేట్లు పొందేలా డిజిటల్ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లను అందిస్తారు. ఇందుకు వీలుగా వాట్సాప్ అప్లికేషన్ ప్రొగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందని మెటా తెలిపింది. మెటా సంస్థలో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై లోకేష్ X లో పోస్ట్ చేశారు. నేరుగా స్మార్ట్ఫోన్ ద్వారానే సర్టిఫికేట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని గతంలో హామీ ఇచ్చినట్లు తెలిపిన లోకేష్ అందుకు అనుగుణంగా వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లు పొందేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో మరింత సులభంగా, పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా మరిన్ని సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెటా డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకొని వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తామని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ వెల్లడించారు. వాట్సాప్ బిజినెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తామని తెలిపారు. AI ఆధారంగా సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో ఏపీ ప్రభుత్వం, మెటా సంస్థలు వెల్లడించలేదు. త్వరలో వాట్సాప్ ద్వారా అన్ని రకాల సర్టిఫికేట్లు, ఇతర సేవలు అందించేందుకు వీలుగా అవసరమైన విధివిధానాలు రూపొందిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలో ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
0 Comments