సౌండ్ పొల్యూషన్తో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న డీజేలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో విధి విధానాల రూపొందిస్తున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డీజేల నిర్వహణపై ఆంక్షలు ఉన్నాయి. కానీ ఎక్కడా ఇవి అమలు కావడం లేవు. చాలా చోట్ల అనధికారికంగా డీజేలు పెడ్తున్నారు. డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో వాటిపై నిషేధం విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పోలీసులు, ప్రజా ప్రతినిధులు, డీజే నిర్వాహకులతో బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి సహా ఇతర పండుగల నేపథ్యంలో డీజేల కారణంగా తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఎంఐఎం, ఎంబీటీ నేతలతో పాటు హిందూ, ముస్లిం, సిక్కు మత పెద్దలు హాజరయ్యారు. గడిచిన పదేళ్లలో డీజేల వాడకం భారీగా పెరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ''మహారాష్ట్రలో డీజేలపై నిషేధం అమల్లో ఉంది. అందుకే తక్కువ ధరకు హైదరాబాద్కు వచ్చి డీజేలు పెడ్తున్నారు. వినాయక ఉత్సవాల్లోనే కాకుండా ఫంక్షన్ హాల్స్, ఇండ్లల్లో, చిన్న చిన్న ఫంక్షన్లలో డీజేలు వాడుతున్నరు. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా గతంలో కంటే ఈ ఏడాది డయల్ 100కు వచ్చిన డీజే ఫిర్యాదులు 500శాతం పెరిగాయి. డీజే సౌండ్స్ కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని, వృద్ధుల గుండె ఆగిపోయేలా ఉందంటూ కంప్లైంట్లు వచ్చాయి. పోలీసులు అక్కడికెళ్లిన తర్వాత కొద్దిసేపు ఆఫ్ చేసి మళ్లీ సౌండ్స్ పెంచుతున్నరు''అని సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి మత్తులో యువత గంటల తరబడి డ్యాన్స్ చేస్తున్నారని తెలిపారు. ''డీజేలు ఉన్న ర్యాలీల బందోబస్తుకు వెళ్లాలంటే పోలీసులు భయపడ్తున్నరు. వయస్సు పైబడిన హెడ్ కానిస్టేబుళ్లు గుండెపోటు వస్తుందని అంటున్నరు. డీజేలు, పటాకుల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది''అని సీవీ ఆనంద్ అన్నారు. ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఉత్సవ సమితీలు, డీజే నిర్వాహకుల సలహాల మేరకు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
డీజేలపై తెలంగాణలో నిషేధం?
الجمعة، 27 سبتمبر 2024
telangana చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు డీజేలపై తెలంగాణలో నిషేధం? వృద్ధులు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో విధి విధానాలు
ليست هناك تعليقات:
إرسال تعليق