పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య ఇవాళ కన్నుమూశారు. దక్షిణ కోల్ కతాలోని ఆయన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ ఉదయం చనిపోయినట్లు సీపీఎం పార్టీ ప్రకటించింది. ఆయన వయస్సు 80 ఏళ్లు. నిమోనియోతో బాధపడుతున్న ఆయన పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నా తిరిగి ఆయన ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు. బుద్ధదేవ్ భట్టాచార్యకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. 2001 నుంచి 2011 వరకూ ఆయన బెంగాల్ సీఎంగా పనిచేశారు. జ్యోతిబసు తర్వాత అత్యధిక కాలం బెంగాల్ ను ఏలిన ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ కు పేరుంది. అంతే కాదు బెంగాల్ కు చిట్టచివరి కమ్యూనిస్టు సీఎం కూడా ఆయనే. సీపీఎంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు కూడా. బెంగాల్లో 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనకు ముగింపు పలికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించినప్పుడు 2011 రాష్ట్ర ఎన్నికలలో బుద్ధదేవ్ సీపీఎంను నడిపించారు. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన బుద్ధదేవ్.. రాజకీయాల్లో చేరడానికి ముందు స్కూలు టీచర్ గా పనిచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తర్వాత 2000లో జ్యోతిబసు పదవీవిరమణ చేసే ముందు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు. 2001లో ముఖ్యమంత్రిగా నియమితులైన బుద్దదేవ్.. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచారు. బుద్ధదేవ్ హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వ్యాపారాల పట్ల సానుకూల విధానం అనుసరించింది. అయితే ఇదే విధానం 2011 ఎన్నికలలో వామపక్షాల ఘోర పరాజయానికి కారణమైంది.
0 Comments