నటి కాదంబరీ జెత్వానీ ఇవాళ విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబును కలిశారు. అంతకు ముందు ఉదయం ఏపీ పోలీసు ఎస్కార్ట్ సాయంతో నగరానికి చేరుకున్న ఆమె స్థానిక నోవాటెల్ హోటల్లో బస చేశారు. అక్కడ ఆమెను కలిసిన పోలీసులు వేధింపుల ఆరోపణలపై వివరాలు సేకరించారు. ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె సాయంత్రం సీపీని కలిశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనపై పెట్టిన తప్పుడు కేసు, అంతకు ముందు ఆమె పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ పై ముంబైలో పెట్టిన కేసు, ఇతర వివరాలను పోలీసులు ఇవాళ కాదంబరీ జెత్వానీ నుంచి తీసుకున్నారు. సజ్జన్ జిందాల్ పై కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఆమెపై జరిగిన వేధింపులు, ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీం పట్నం పోలీసులు తనపై నమోదు చేసిన ఫోర్జరీ కేసు, దీనిపై ఐపీఎస్ లు ముంబై వచ్చి మరీ తనను, కుటుంబ సభ్యుల్ని అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపడం వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. మరోవైపు ఇబ్రహీంపట్నం పీఎస్ లో కుక్కల విద్యాసాగర్ ఆస్తిని బెదిరించి రాయించుకుందంటూ కాదంబరిపై నమోదైన కేసులో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఆదేశాలతోనే తాము అప్పట్లో ముంబైకి వెళ్లి ఆమెను కుటుంబంతో తీసుకురావడం, వేధింపులకు గురి చేసినట్లు విచారణలో పోలీసు సిబ్బంది చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరో ఇద్దరు ఐపీఎస్ లు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ ఎవరి ఆదేశాలతో కదిలారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. ఇవాళ, రేపు కాదంబరి నగరంలోనే పోలీసు భద్రత మధ్య ఉండే అవకాశముంది. 

Post a Comment

أحدث أقدم