కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. ''మా ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్టు ఎమ్మెల్యే రవికుమార్ గౌడ నాతో చెప్పారు. బీజేపీ కేవలం 'ఆపరేషన్ లోటస్'తోనే కర్ణాటకలో అధికారంలోకి వస్తుంటుంది. ప్రజల ఆశీస్సులతో ఎన్నడూ ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. 2008, 2019లో ఆపరేషన్ లోటస్‌తో దొడ్డిదారిలో వాళ్లు అధికారంలోకి వచ్చారు'' అని సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమ ప్రభుత్వాన్ని కూల్చడం అంత సులభం కాదని అన్నారు. సుమారు 60 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, అయితే, మా ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా డబ్బులకు ఆశపడరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నటుడు దర్శన్‌కు జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడం సంచలనం కావడంపై సీఎం మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది సిబ్బందిని సస్పెండ్ చేశామని, బళ్లారి జైలుకు దర్శన్‍ను తరలించామి చెప్పారు. డీజీపీకి నోటీసు కూడా ఇచ్చామన్నారు. కాగా, మహదయి ప్రాజెక్టు పనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తమకు పర్యావరణ అనుమతి ఇస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని సిద్ధరామయ్య తెలిపారు.

Post a Comment

أحدث أقدم