వక్ఫ్ బిల్లు ఓ మతం లక్ష్యంగా తీసుకొచ్చారని టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మండిపడ్డారు. మతం ఆధారంగా చీలిక తీసుకొచ్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తెచ్చిందని విపక్ష ఇండియా కూటమి భావిస్తోందని పేర్కొన్నారు. విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించిందని అన్నారు. కాగా, అంతకుముందు వక్ఫ్ బిల్లుపై ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అసలు మోదీ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వమేనా అనేది మనం ఆలోచించాలని అన్నారు. ముస్లింల ప్రయోజనాల కోసం వారు ఏ చట్టాన్ని అయినా రూపొందించారా అని ప్రశ్నించారు.ముస్లింల మేలు కోసం ఏ ఒక్క పధకమైనా తీసుకొచ్చారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ను రద్దు చేసింది. మదర్సాలకు నిధులను నిలిపివేసిందని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ముస్లింల మేలు కోరే ప్రభుత్వం కాదని ఆజాద్ స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని విస్మరించి వారు ఎలా ముందుకెళతారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే తాము ఎట్టిపరిస్ధితుల్లో మౌనంగా కూర్చోబోమని హెచ్చరించారు.
0 Comments