ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. వాలంటీర్లకు అపోహలొద్దని ఆయన తేల్చి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు జరుగుతోన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు. వాలంటీర్లు తమ భవిష్యత్ పట్ల ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన పని లేదని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసే దుష్ట చర్యలను ఉపేక్షించమన్నారు. ప్రభుత్వ సేవల ముసుగు వేసి వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకున్నది వైసీపీ పాలకులేనంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యూవల్ చేయకుండా గత పాలకులు దగా చేశారన్నారు. వాలంటీర్ల భవిష్యత్నూ దెబ్బకొట్టేందుకు నిరాధార, ప్రచారం చేయడం దుర్మార్గమని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
0 Comments