వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

తెలంగాణలోని ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం గురువారం ఉదయం 6.10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయలుదేరిన 20701 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘట్‌కేసర్‌, బీబీనగర్‌ మధ్య కేఎం నంబర్‌ 221/10-221/12 వద్దకు చేరుకుంది. అదే సమయంలో సుమారు 20-25 ఏళ్ల వయసున్న వ్యక్తి ఏపీ 24 ఎన్‌ 9936 నంబర్‌ గల ఫ్యాషన్‌ ప్లస్‌ మోటార్‌ సైకిల్‌పై రైల్వే పట్టాల మధ్య నుంచి బీబీనగర్‌ వైపు వెళ్తుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను కొంత దూరం ఈడ్చుకెళ్లబడి పట్టాల పక్కన పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో ద్విచక్ర వాహనం ధ్వంసమై, దాని విడిభాగాలు సుమారు 300 మీటర్ల మేర రైల్వే ట్రాక్‌పై పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో అతని వివరాలు తెలియరాలేదు. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు కలిగి ఉండగా, కుడి వైపు ఛాతీ పై పుట్టుమచ్చ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ డిప్యూటీ ఎస్‌ఎస్‌ నుంచి సమాచారం అందడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ లేదా వివరాలు తెలిసిన వారు సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ 8712658581 లేదా దర్యాప్తు అధికారి 9666280808 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

Post a Comment

0 Comments