బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఇద్దరు అనుమానితుల అరెస్టు : నకిలీ పీఎంఓ గుర్తింపు కార్డు, తుపాకీ స్వాధీనం

ప్రధాని నరేంద్ర మోడీ ముంబై పర్యటనకు ముందు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో భద్రతా కలకలం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ పాల్గొననున్న కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు తాను ప్రధానమంత్రి కార్యాలయం అధికారినని చెప్పుకున్నట్లు సమాచారం. అతని వద్ద నకిలీ పీఎంఓ గుర్తింపు కార్డు, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక వివరాల ప్రకారం, ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ ప్రాంగణంలో ఈ ఇద్దరిని గుర్తించారు. నకిలీ గుర్తింపు కార్డుతో ఉన్న వ్యక్తిని 24 ఏళ్ల రోహన్ పరేఖ్‌గా గుర్తించారు. అతనితో పాటు ఉన్న అంగరక్షకుడి వద్ద తుపాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో గుర్తింపు కార్డు అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించగా అది నకిలీదని తేలింది. నకిలీ పీఎంఓ గుర్తింపు కార్డును ఎలా సంపాదించాడు? తాను పీఎంఓ అధికారినని ఎందుకు చెప్పుకున్నాడు? తుపాకీతో ఉన్న బాడీగార్డుతో కలిసి ప్రధాని కార్యక్రమం జరిగే ప్రదేశంలోకి ఎందుకు రావడానికి ప్రయత్నించారు? అనే అంశాలపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. అయితే, ప్రస్తుతానికి ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో వారు అక్కడికి వచ్చినట్లు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

Post a Comment

0 Comments