ఐక్యరాజ్యసమితిలో ఆఫ్రికన్ యూనియన్ ప్రతిపాదించిన కరెక్ట్ ది మ్యాప్ తీర్మానానికి భారత్ మద్దతు తెలిపినప్పటికీ, ఈ కొత్త మ్యాప్ లో దేశ సరిహద్దులను వివాదాస్పదంగా చూపించడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారత్ అంతర్భాగంగా భావించే అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్, చైనా సరిహద్దుల మధ్య ఉన్న ప్రత్యేక స్వతంత్ర సరిహద్దు ప్రాంతాలుగా చూపించడం వివాదానికి దారితీసింది. ఈ కొత్త పటంలో ఈ రెండు ప్రాంతాల అంతర్గత రూపురేఖలను మార్చేశారు. అరుణాచల్ ప్రదేశ్కు నాగాలాండ్తో ఉన్న సరిహద్దును తొలగించి, దాన్ని కేవలం అస్సాం, చైనా సరిహద్దులతో ముడిపడి ఉన్న స్వతంత్ర ప్రాంతంగా చూపించారు. అలాగే అక్సాయ్ చిన్ను కూడా పశ్చిమాన భారత్తో, తూర్పున చైనాతో సరిహద్దులు కలిగిన స్వతంత్ర విభాగంగా ప్రతిపాదించారు. అయితే ఈ సరిహద్దు మార్పులకు గల కారణాలను ఐక్యరాజ్యసమితి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అలాగే జమ్మూ కాశ్మీర్ అంశాన్ని కూడా ఐరాస ప్రస్తావించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న నియంత్రణ రేఖను చుక్కల గీతతో సూచించింది. కాశ్మీర్ తుది స్థితిపై ఇరు దేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని మ్యాప్ దిగువన ఒక గమనిక ద్వారా పేర్కొంది. దీనిపై భారత్ స్పందిస్తూ, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏ రూపంలో తప్పుగా చూపించే ప్రయత్నాలనైనా తీవ్రంగా నిరసిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన భారత్.. జమ్మూ కాశ్మీర్, లడఖ్, అక్సాయ్ చిన్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ వివాదాస్పద సరిహద్దులను తాము అంగీకరించబోమని కేంద్రం తేల్చిచెప్పింది. ఈ అంతర్జాతీయ తీర్మానం చట్టపరంగా ఎలాంటి ఒత్తిడి తీసుకురానప్పటికీ, భవిష్యత్తులో గ్లోబల్ మ్యాపింగ్ సంస్థలు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే వచ్చే పరిణామాలపై నిఘా ఉంచామని తెలిపింది.
0 Comments