గ్లోబల్ సప్లై చైన్ హబ్‌గా భారత్ : అంతర్గత బ్రిక్స్ వస్తు వాణిజ్యం 2024 నాటికి 13 రెట్లు పెరుగుదల

అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల నిర్మాణంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2003లో 84 బిలియన్ డాలర్లుగా ఉన్న అంతర్గత బ్రిక్స్ వస్తు వాణిజ్యం, 2024 నాటికి ఏకంగా 13 రెట్లు పెరిగి 1.17 ట్రిలియన్ డాలర్లకు చేరిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచ వాణిజ్యంలో బ్రిక్స్ దేశాలు దాదాపు నాలుగో వంతు వాటాను కలిగి ఉన్నాయని, సభ్య దేశాలన్నీ విభిన్న సరఫరా మార్గాలను ప్రోత్సహించాలని సదస్సుకు ముందు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ మార్కెట్లలో చైనాకు ప్రత్యామ్నాయంగా నిలిచే 'చైనా ప్లస్ వన్' గమ్యస్థానంగా భారత్ ఎదగగలదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2018 నాటి అమెరికా-చైనా సుంకాలు, కరోనా లాక్‌డౌన్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ కంపెనీలు తమ తయారీని ఒకే దేశంపై ఆధారపడకుండా విస్తరించడం (చైనా+1) ప్రారంభించాయి. మెక్సికో, వియత్నాం, థాయ్‌లాండ్‌లతో పాటు భారత్ కూడా ఇందులో కీలక వాటాను దక్కించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం దేశీయంగా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని సరికొత్త స్థాయికి చేర్చింది. 2020 ఆర్థిక సంవత్సరంలో 30 బిలియన్ డాలర్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి, 2026 ఆర్థిక సంవత్సరానికి 71 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 3 బిలియన్ డాలర్ల నుంచి దాదాపు పది రెట్లు పెరిగి 29.4 బిలియన్ డాలర్లను తాకాయి. ఆపిల్ వంటి దిగ్గజాలు ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా భారత్‌లో ఉత్పత్తిని భారీగా పెంచాయి. అయితే కేవలం విడిభాగాలను అసెంబుల్ చేయడమే కాకుండా, సమగ్ర తయారీ సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నప్పుడే భారత్‌కు పూర్తి స్థాయి ప్రయోజనం దక్కుతుందని పారిశ్రామిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత ఎగుమతులు అమెరికా, యూరప్‌లను దాటి ఇతర మార్కెట్లకు విస్తరిస్తున్నాయని మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ విశ్లేషణ తెలిపింది. ఆసియాన్, ఆఫ్రికా దేశాలకు భారత పెట్రోలియం ఉత్పత్తులు, స్మార్ట్‌ఫోన్లు, రవాణా పరికరాల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్‌కు 2025లో 8.35 బిలియన్ డాలర్లు, దక్షిణాఫ్రికాకు 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేసింది. బ్రిక్స్ దేశాలకు భారత ఎగుమతులు 2025-26లోని 96 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అసోచామ్ అంచనా వేసింది. ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ, భారతీయ ఫ్యాక్టరీలకు అవసరమైన కీలక యంత్రాలు, ముడి వస్తువుల కోసం ఇప్పటికీ చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ చైనా నుంచి సుమారు 132 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు పెరిగినా, చిప్స్‌తో సహా ఎలక్ట్రానిక్స్ దిగుమతులు జూలై 2026 నాటికి 44 శాతం పెరిగి 14.37 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఆధారపడటాన్ని తగ్గించేందుకు శాంసంగ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో రూ. 41,863 కోట్ల విలువైన విడిభాగాల తయారీ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బ్రిక్స్ నాయకత్వం వహిస్తున్న భారత్.. 2026-30 గ్లోబల్ వాల్యూ చైన్స్ కార్యాచరణను ముందుకు తెచ్చింది. ఫార్మా, ఆహార భద్రత, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది. వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, భారీ దేశీయ మార్కెట్, బలమైన ఫార్మా, ఆటో రంగాల పునాదులు భారత్‌కు ప్రధాన బలంగా మారాయి. కేవలం 'చైనా ప్లస్ వన్' ప్రత్యామ్నాయంగా మాత్రమే కాకుండా, తన స్వంత నైపుణ్యంతో భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. స్థానిక సరఫరా వ్యవస్థలను మరింత లోతుగా విస్తరించగలిగితేనే భారత్ గ్లోబల్ సౌత్‌కు పూర్తిస్థాయి తయారీ ప్రత్యామ్నాయంగా అవతరించగలదని నిపుణులు భావిస్తున్నారు.

Post a Comment

0 Comments