తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాల నియంత్రణ, పనితీరులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సైబర్ భద్రతకు సంబంధించిన 9 కీలక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. ఆ అంశాలు ఏవంటే.. రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (S4C) ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలు, ఫిర్యాదుల పరిష్కార విభాగం, డబ్బును రీఫండ్ చేసే మనీ రెస్టోరేషన్ మాడ్యూల్, హానికర కంటెంట్ తొలగించే ‘సహాయోగ్’ పోర్టల్, ‘సమన్వయ’ పోర్టల్ వినియోగం, సైబర్ హాట్స్పాట్ల గుర్తింపు, అధికారుల శిక్షణ మరియు ప్రజలకు అవగాహన కల్పించడం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఐ4సి (I4C) అభివృద్ధి చేసిన పోర్టళ్లను సమర్థవంతంగా వాడినందుకు తెలంగాణను ప్రత్యేకంగా అభినందించారు. పౌరుల సౌకర్యార్థం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్ 8712665600 ను ఏర్పాటు చేసింది. బ్యాంకు ఖాతాల ఫ్రీజ్/అన్ఫ్రీజ్ సమస్యల పరిష్కారానికి ఇది పనిచేస్తుంది. ఆగస్టు 2 నాటికి వచ్చిన 2,368 దరఖాస్తుల్లో 2,086 (88%) పరిష్కారమయ్యాయి. మనీ రెస్టోరేషన్ లో భాగంగా.. బాధితులకు డబ్బు వేగంగా ఇచ్చేందుకు ఇది తోడ్పడుతుంది. ఎఫ్.ఐ.ఆర్ లేదా కోర్టు ఉత్తర్వులు లేకపోయినా రూ.50,000 వరకు నేరుగా రిఫండ్ పొందవచ్చు. రూ.50,000 దాటితే కోర్టు ఆదేశాలు అవసరం. తెలంగాణలో రూ.16.42 కోట్ల రికవరీకి సంబంధించి 34,524 కేసులు నమోదు కాగా, 28,097 కేసుల్లో (81.38%) చట్టపరమైన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సహాయోగ్ పోర్టల్ లో భాగంగా సోషల్ మీడియాలోని అనవసర, ప్రమాదకర లింకులను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణలో నమోదైన 22,447 యు.ఆర్.ఎల్లలో 20,070 (89.41%) తొలగించారు. సమన్వయ పోర్టల్ అనేది దేశవ్యాప్తంగా పోలీసుల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 6,721 విజ్ఞప్తులలో 6,518 (96.68%) పూర్తి చేశారు. అలాగే తెలంగాణ నుండి పంపిన 7,018 విజ్ఞప్తులలో 5,560 (79.22%) పూర్తయ్యాయి. ఈ పోర్టల్ ద్వారా 3,524 కేసులు అప్లోడ్ చేసి, 5,493 మంది నిందితుల ప్రొఫైల్స్ 14,964 అంతర్రాష్ట్ర లింకులను కనుగొన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ (ఐ.పి.ఎస్) ఈ విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ మోసానికి గురైతే పౌరులు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా హెల్ప్లైన్ 8712665600 ను సంప్రదించాలని కోరారు.
0 Comments