తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారని, వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ, తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండటంపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని సురేఖ కోరారు. "పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే సమయంలో, ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా పార్టీ నాయకత్వం పరిశీలించాలి" అని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు.
తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు అవమానకరంగా వ్యాఖ్యలు చేయిస్తున్నారు : క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق