కోళ్ల దాణా ధరలు భారీగా పెరిగాయి. గతంలో టన్ను సోయాబీన్ ముప్పై వేల రూపాయల నుండి ముప్పై ఐదు వేల రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ ధరలు రెట్టింపు అయ్యాయి. అదేవిధంగా మొక్కజొన్న, వేరుశనగ చెక్క, నూకల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దాణా ధరలు ఇలాగే పెరిగితే మార్కెట్లో కేజీ చికెన్ ధర మూడు వందల రూపాయలు దాటే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్లో సోయాబీన్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. దీనికి తోడు మొక్కజొన్నను విరివిగా ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల దాణా తయారీకి కావాల్సిన ముడి పదార్థాల కొరత తీవ్రమైంది. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తగ్గిపోవడంతో నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. కోళ్ల పెంపకం దారులు ఈ భారాన్ని మోయలేక సతమతమవుతున్నారు. ఫలితంగా ఈ ప్రభావం నేరుగా చికెన్ రేట్ల మీద పడుతోంది. ఈ పరిణామాల కారణంగా పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సామాన్య ప్రజల బడ్జెట్ పై ఇది అదనపు భారాన్ని మోపుతోంది. ఇప్పటికే అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిన వేళ, ఇప్పుడు చికెన్ ధరలు కూడా పెరిగితే మాంసం ప్రియులకు ఇబ్బందులు తప్పవు.
إرسال تعليق