జపాన్లోని కుమమోటో ఏయాన్ షాపింగ్ మాల్ విషాదం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దాదాపు పదేళ్ల కిందట భూకంపాన్ని తట్టుకుని తిరిగి నిలబడిన ఈ మాల్ తాజాగా సంభవించిన భారీ ప్రకంపనలకు మరోసారి తీవ్రంగా దెబ్బతింది. మంగళవారం కుమమోటో ప్రాంతాన్ని వణికించిన 7.1 తీవ్రత గల భూకంపం ధాటికి 13 మంది మృతి చెందారు. అదే ఏరియాలో ఏయాన్ మాల్లోని రెండో అంతస్తు కుప్పకూలింది. ఆ తర్వాత చోటుచేసుకున్న పేలుడు పరిస్థితిని మరింత విషమంగా మార్చింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకోగా, ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కుమమోటో ప్రాంతానికి భూకంపాలు కొత్తేమీ కాదు. 2016లో వచ్చిన భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆ ప్రకంపనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. వాటిలో ఏయాన్ కుమమోటో షాపింగ్ మాల్ కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత మాల్ను మూసివేసి భారీ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. భూకంపాలను తట్టుకునేలా నిర్మాణంలో మార్పులు చేశారు. ఆధునిక భద్రతా ప్రమాణాలతో బలోపేతం చేశారు. చివరకు 2026 జూన్ 13న కొత్త రూపంలో తిరిగి ప్రారంభించారు. దాదాపు 200 దుకాణాలు, సినిమా థియేటర్, ఫుడ్ కోర్ట్, వేలాది వాహనాలకు పార్కింగ్ సదుపాయాలతో ఈ మాల్ కుమమోటో ప్రజలకు ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల తర్వాత తిరిగి తెరుచుకోవడం స్థానికుల్లో కొత్త ఆశలు నింపింది. అయితే ఆ ఆనందం నెల రోజులు కూడా నిలవలేదు. భారీ భూకంపం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. ప్రకంపనలు మొదలైన వెంటనే మాల్లో ఉన్న ప్రజలను బయటకు తరలించే ప్రయత్నాలు జరిగాయి. అయితే కొద్దిసేపటికే సంభవించిన పేలుడు మరింత భయాందోళనకు గురిచేసింది. పేలుడుకు గ్యాస్ లీక్ కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి భవనం భాగాలు కూలిపోవడంతో పలువురు లోపల చిక్కుకున్నారు. శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్న వారిని గుర్తించేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
0 Comments