దేశంలో విరివిగా అమ్ముడవుతున్న ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. రెడ్ బుల్, పెప్సికో, కాంపా, స్టింగ్, హెల్ ఎనర్జీ, కోకాకోలాతో సహా ఆరు కంపెనీలకు ఆహార భద్రతా సంస్థ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీలు తమ పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్స్’ గా పేర్కొంటూ వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు లేబుల్స్ వేస్తున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రాండింగ్, ప్రమోషన్స్ మరియు మార్కెటింగ్ విషయాల్లో ఈ సంస్థలు నిర్దేశిత ఆహార భద్రతా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించాయని, తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసుల నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలకమైన సాంకేతికాంశాన్ని స్పష్టం చేసింది. తమ నిబంధనల ప్రకారం ‘ఎనర్జీ డ్రింక్స్’ అనే ప్రత్యేక కేటగిరీకి సంబంధించి తాము ఎలాంటి ప్రమాణాలను (స్టాండర్డ్స్) నోటిఫై చేయలేదని, అయినప్పటికీ ఈ కంపెనీలు సదరు లేబుళ్లను ఇష్టారాజ్యంగా వాడుతున్నాయని పేర్కొంది. సాధారణంగా కెఫిన్, చక్కెర శాతాలు ఎక్కువగా ఉండే ఇటువంటి పానీయాలను నాన్-ఆల్కహాలిక్ కార్బోనేటెడ్ బెవరేజెస్ కింద పరిగణించాల్సి ఉండగా, కంపెనీలు మాత్రం హెల్త్ మరియు ఎనర్జీ సప్లిమెంట్స్ తరహాలో ప్రచారం చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
0 Comments