ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన 'మన ఇల్లు- మన లోకేశ్' కార్యక్రమంలో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 3,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద కుటుంబాలకు రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తిని పట్టాల రూపంలో అందించడం గమనార్హం. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టే నాటికి ఆదాయం ఒక్క రూపాయి ఉంటే, ఖర్చు రూ.1.60 పైసలుగా ఉండేదని లోకేశ్ తెలిపారు. అయితే గత రెండేళ్లలో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి ఫలితంగా ఆ ఖర్చును రూ.1.40కి తగ్గించగలిగామని వివరించారు. ఈ శాశ్వత భూపట్టాలతో పేదల ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుందని, వీటిని ఎవరూ కదిలించలేరని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత తనతో పాటు చంద్రబాబును కూడా కొందరు అవహేళన చేశారని, ఆ కసితోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నానని లోకేశ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే అత్యుత్తమంగా, నంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
0 Comments