ఒడిశా లోని మల్కన్గిరి జిల్లాలో పాము కాటుతో 8 నెలల గర్భిణి మరణించిన సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, ఉద్రిక్తతను రేకెత్తించింది. వందనా మోండల్ అనే గర్భిణి, అర్ధరాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురైనట్లు తెలుస్తోంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆ పామును అక్కడికక్కడే కొట్టి చంపి, ఆ పాముతో సహా ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో ఆమెకు సరైన వైద్యం అందించలేదని, కండిషన్ సరిగ్గా కాకముందే డాక్టర్లు ఆమెను ఇంటికి పంపించేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో మళ్లీ ఆమెను ఆసుపత్రికి తీసుకురాగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హఠాన్మరణంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళ బంధువులు మరియు స్థానిక ప్రజలు ఆసుపత్రిపై దాడి చేసి, అక్కడున్న డాక్టర్ మరియు వైద్య సిబ్బందిని విచక్షణారహితంగా చితకబాదారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మరణించిందని వారు తీవ్రంగా ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను చికిత్స అందించిన డాక్టర్ సిద్ధార్థ్ బోలా పూర్తిగా ఖండించారు. రోగికి కావలసిన అన్ని రకాల అత్యవసర చికిత్సలు, మందులు అందించామని.. చికిత్స పూర్తయిన తర్వాత వారి అంతట వారే ఇంటికి వెళ్లారని ఆయన స్పష్టం చేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆసుపత్రిలో హింసకు పాల్పడి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.
0 Comments