ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !


తెలంగాణలోని మంచిర్యాల హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించి, అతి దారుణంగా హత్య చేయించింది. ఆపై ఏమీ తెలియనట్టు ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు డ్రామా ఆడింది.  హాజీపూర్ పరిధిలో నివసించే సాయిని కుమార్ (40) భార్య భారతికి కొన్నేళ్లుగా లగిశెట్టి సురేందర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భారతి, అతడిని వదిలించుకోవాలని నిర్ణయించింది. అయితే కేవలం చంపేయడమే కాకుండా, భర్త శవంపై కోట్లు సంపాదించాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే ఏడాది క్రితం భర్త పేరిట రూ.3 కోట్ల భారీ జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) చేయించింది. ఆ తర్వాత సాయిని కుమార్‌తో పాత కక్షలు ఉన్న రామ్ మల్లేష్ అనే వ్యక్తికి భర్తను చంపేందుకు భారీ మొత్తంలో సుపారీ ఇచ్చింది. పథకం ప్రకారం ఈ నెల 22వ తేదీన సుపారీ హంతకుడు రామ్ మల్లేష్ తన స్నేహితుడు శ్రీరామ్ కుమార్‌తో కలిసి సాయిని కుమార్‌ను మద్యం తాగుదామంటూ పిలిచాడు. ముగ్గురూ కలిసి మందు తాగిన తర్వాత, సాయిని కుమార్ మత్తులోకి జారుకోగానే.. ముందే ప్లాన్ చేసుకున్నట్టు ఇనుప సుత్తితో అతడి తలపై బలంగా బాది ప్రాణాలు తీశారు. అనంతరం అది హిట్ అండ్ రన్ కేసుగా నమ్మించేందుకు మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి ఏమీ ఎరగనట్టు పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు మొదట దీనిని రోడ్డు ప్రమాదంగానే భావించి కేసు నమోదు చేశారు. కానీ, పోస్ట్‌మార్టం రిపోర్టులో తలపై ఉన్న గాయాలు వాహనం ఢీకొట్టడం వల్ల కాలేదని, సుత్తి లాంటి బలమైన వస్తువుతో కొట్టడం వల్లే జరిగాయని వైద్యులు తేల్చారు. దీంతో రూట్ మార్చిన పోలీసులు సాయిని కుమార్ కాల్ డేటాను పరిశీలించగా భార్య భారతి బంధం బయటపడింది. భారతిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ప్రియుడు, సుపారీ గ్యాంగ్‌తో కలిసి భర్తను చంపించినట్లు అంగీకరించింది. దీంతో నిందితులు భారతి, ఆమె ప్రియుడు సురేందర్, హంతకులు రామ్ మల్లేష్, శ్రీరామ్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Post a Comment

0 Comments