పాఠశాలల వేసవి సెలవుల దృష్ట్యా సొంత ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. ఇందుకనుగుణంగా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ దర్శనమిస్తోంది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ అరకొర రైళ్లే అందుబాటులో ఉన్నాయి. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి- షాలిమార్, సికింద్రాబాద్‌- చెన్నై, సంత్రాగచి్చ- చెన్నై, చర్లపల్లి-సంత్రాగచి్చ, సికింద్రాబాద్‌- శ్రీకాకుళం మార్గాల్లో కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ, తిరుపతి, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్‌ రైళ్లలో ఇప్పటికే ఏసీ,నాన్‌ ఏసీ కోచ్‌లలో రిజర్వేషన్‌లు నిండిపోయాయి. పాటా్న, భువనేశ్వర్, కోల్‌కతా, జైపూర్‌ తదితర దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ పెరిగింది. సాధారణ రోజుల్లో సికింద్రాబాద్‌ నుంచి నిత్యం 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య 2.20 లక్షలు దాటినట్లు అంచనా. చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్‌ల నుంచి ఇప్పటికే రాకపోకలు భారీగా పెరిగాయి. తిరుపతికి రోజూ 5 రైళ్లు నడుస్తున్నా డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. ఒక్కో రైల్లో 100 నుంచి 150కిపైగా వెయిటింగ్‌ లిస్టు కనిపిస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది. ఇక సికింద్రాబాద్‌ నుంచి షిర్డీకి వెళ్లేందుకు అజంతా ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ఉంది. రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులున్నారు. రూట్‌లో రెగ్యులర్‌గా ఒక ట్రైన్‌ అదనంగా నడపాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌ నుంచి విశాఖ, కాకినాడ, బెంగళూరు, ముంబై, పుణె నగరాల మధ్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ప్రయాణాలు కూడా పెరిగాయి. వేసవి దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు బంధుమిత్రుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇందుకు తగినట్లుగా రైళ్లు మాత్రం అందుబాటులో లేకుండాపోయాయి. 

Post a Comment

أحدث أقدم