మే 1వ తేదీన 'మహారాష్ట్ర దినోత్సవం' సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్‌గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ నూతన విధానాన్ని వెల్లడించారు. ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్ల వల్ల భాషా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 'మరాఠీ మన రాష్ట్ర అధికారిక భాష. ప్రజా సేవల్లో దాని వాడకాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. డ్రైవర్లకు మరాఠీ చదవడం, రాయడం, మాట్లాడటం వస్తేనే ప్రయాణికులకు మెరుగైన భద్రత, సేవలు అందుతాయి' అన్నారు. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి రవాణా శాఖకు చెందిన 59 ప్రాంతీయ (ఆర్‌టీఓ), ఉప ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు మరాఠీలో తమ ప్రాథమిక నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారికి మరాఠీ చదవడం, రాయడం వస్తుందా లేదా అని అధికారులు ధృవీకరిస్తారు. కేవలం డ్రైవర్లే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేసే అధికారులపై కూడా నిఘా పెంచనున్నారు. అర్హత లేని వారికి లైసెన్సులు ఇస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

Post a Comment

أحدث أقدم