తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తప్పుబట్టడమే కాకుండా, తనపై కూడా నిఘా ఉందన్న అనుమానాలను వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. "సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ గారే స్వయంగా వెల్లడిస్తారని నేను భావిస్తున్నాను. ఈ కేసు మొదలై రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఓ ముగింపునకు రాకపోవడం బాధాకరం. విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ అక్రమాలకు పాల్పడిన అసలైన దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి" అని కవిత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. "సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదు. దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తున్నప్పుడు సహకరించాలి. ఒకవేళ విచారణ కోసం సిట్ నన్ను పిలిచినా వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తాను కూడా ఉన్నానని కవిత ఆరోపించారు. "నా ఫోన్ మాత్రమే కాదు, నా భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని నాకు బలమైన అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రావాలి" అని ఆమె పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم