తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యుల కోసం ఇందిరా డెయిరీ ప్రాజెక్టు ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించి, స్థిరమైన ఆదాయ వనరులు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా పేర్కొంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ప్రారంభించారు. మొదటి దశలో మంచి స్పందన రావడంతో, త్వరలోనే కొడంగల్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళా సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి రెండు పాడి గేదెలు లేదా ఆవులు అందించనున్నారు. ఒక్కో యూనిట్ మొత్తం విలువ రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో ప్రభుత్వం రూ.1.40 లక్షలను సబ్సిడీగా అందించనుంది. మిగిలిన రూ.60 వేల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా కల్పిస్తారు. దీంతో మహిళలపై ఆర్థిక భారం తక్కువగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాడి పరిశ్రమ ద్వారా రోజువారీ ఆదాయం లభించడంతో పాటు, పాలు, పాల ఉత్పత్తుల విక్రయం ద్వారా మహిళలు స్వయం ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. మహిళా సంఘాలను కేంద్రంగా చేసుకుని అమలు చేస్తున్న ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు చెబుతున్నారు.
0 Comments