ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో చలిగాలులు తీవ్రంగా వీచుతున్నాయి. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా పల్లెలు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో కోల్డ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చలితో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. రాబోయే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై స్పష్టమైన నివేదికను విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫియర్ స్థాయిలో ఉత్తర-ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉత్తర కోస్తా, యానాంల్లో ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగనుంది. బుధవారం, గురువారం రోజుల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి మళ్లీ పొడి వాతావరణం నెలకొననుంది. రాయలసీమలో కూడా బుధవారం, గురువారం రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం నుంచి వర్షాలు తగ్గి, వాతావరణం పొడిగా మారే సూచనలు ఉన్నాయి. రాబోయే మూడు రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాతి రెండు రోజుల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగనుంది. అయితే రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుంచి 5°C వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో మరో కొన్ని రోజుల పాటు చలి ప్రభావం కొనసాగనుండగా, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
الأربعاء، 31 ديسمبر 2025
People are hesitant to venture out in the early morning hours resulting in severe cold winds telangana Temperatures drop significantly in Andhra Pradesh weather
ليست هناك تعليقات:
إرسال تعليق