భారతదేశంలో వంశపారంపర్య రాజకీయాలకు బదులు మెరిట్ బేస్డ్ పాలిటిక్స్‌ను అవలంబించాల్సిన సమయం ఇదేనని  కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీల్లో కాలపరిమితిని నిర్ణయించడం, అసలైన పార్టీ ఎన్నికలు నిర్వహించడం వంటి సంస్కరణలు చేపట్టాలన్నారు. ఒకరి ఇంటిపేరు చూసి ఓటు వేయకుండా, అర్హతను చూసి ఓటర్లు ఓటు వేసేలా అవగాహన కల్పించడం ముఖ్యమని థరూర్ అన్నారు. అధికారం సామర్థ్యం, ప్రజలతో అనుబంధం కంటే కుటుంబ గుర్తింపుపై ఆధారపడి ఉంటే అప్పుడు పాలనా నాణ్యత పడిపోతుందని ఆయన అన్నారు. ఈ సమస్య కేవలం కాంగ్రెస్‌కే పరిమితం కాదని, రాజకీయ వ్యవస్థ అంతటా వ్యాపించి ఉందని శశిథరూర్ 'ఇండియన్ పాలిటిక్స్ ఆర్ ఎ ఫ్యామిలీ బిజినెస్' అనే తన ఆర్టికల్‌లో రాశారు. థరూర్ ప్రకారం అభ్యర్థి అతిపెద్ద గుర్తింపు అతని ఇంటిపేరు అయినప్పుడు, ప్రతిభకు కొరత ఏర్పడుతుంది.. ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. తన ఆర్టికల్‌లో థరూర్ చాలా ఉదాహరణలు ఇచ్చారు. "ఒడిశాలో బిజూ పట్నాయక్ తర్వాత, అతని కుమారుడు నవీన్ పట్నాయక్ బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో రాజవంశం బాల్ ఠాక్రే నుండి ఉద్ధవ్ థాకరేకు, తరువాత అతని కుమారుడు ఆదిత్యకు బదిలీ చేయబడింది. యూపీలో ములాయం సింగ్ యాదవ్ నుండి అఖిలేష్ యాదవ్ వరకు, బీహార్‌లో రామ్ విలాస్ పాశ్వాన్ నుండి చిరాగ్ పాశ్వాన్ వరకూ, పంజాబ్‌లో ప్రకాష్ సింగ్ బాదల్ నుండి సుఖ్‌బీర్ బాదల్ వరకు ఇదే కథ పునరావృతమైంది. జమ్మూకశ్మీర్‌లో కూడా అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు చాలా కాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయని థరూర్ అన్నారు. "ఈ ధోరణి భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియా అంతటా కనిపిస్తుంది. పాకిస్తాన్‌లో భుట్టో, షరీఫ్ కుటుంబాలు, బంగ్లాదేశ్‌లోని షేక్, జియా కుటుంబాలు, శ్రీలంకలో దార్నాయక్, రాజపక్సే కుటుంబాలు" అని ఆయన రాశారు. భారతదేశం వంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ రాజవంశాల పోకడ అవలంబించడమనేది విరుద్ధమైన విధానం అని ఆయన రాశారు. కుటుంబం ఒక బ్రాండ్‌లా పనిచేస్తుందని, ప్రజలు వారిని గుర్తించి విశ్వసించడానికి సమయం పట్టదని థరూర్ రాశారు. ఈ కారణంగా అటువంటి అభ్యర్థులకు ఓట్లు వస్తాయన్నారు.

Post a Comment

أحدث أقدم